Shadab Khan : భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్(Ajit Agarkar)పై పాకిస్థాన్ ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్(Shadab Khan) ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసియా కప్(Asia cup 2023)లో పాక్ బౌలర్ల పని విరాట్ కోహ్లీ(Virat Kohli) చూసుకుంటాడు అన్న అగార్కర్ వ్యాఖ్యలపై షాదాబ్ కౌంటర్ ఇచ్చాడు. ‘మాటలు కాదు.. చేతలు ముఖ్యమ’ని పేర్కొన్నాడు. ‘బరిలోకి దిగాక ఏం జరుగుతుందనేది ముఖ్యం. దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. బయటి నుంచి ఎవరైనా ఏదైనా అనొచ్చు. కానీ వాటి వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. మ్యాచ్ జరిగినప్పుడు కదా అసలేం జరుగుతుందో తెలిసేది’ అని షాదాబ్ అన్నాడు.
కాంటినెంటల్ టోర్నీకి 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన అగార్కర్.. మీడియా సమావేశంలో పలు అంశాలపై వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో ‘పాక్ బౌలర్లు ఫుల్ స్వింగ్లో ఉన్నారు.. వారిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్లాన్ వేశారు’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి అగార్కర్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. ‘‘పాక్ బౌలర్ల పని విరాట్ కోహ్లీ చూసుకుంటాడు’’ అని పేర్కొన్నాడు. దీనిపై తాజాగా షాదాబ్ వ్యాఖ్యానించాడు.
విరాట్ కోహ్లీ
నిరుడు టీ20 ప్రపంచ కప్(T20 World Cup)లో పాక్ పేసర్లను కోహ్లీ ఊచకోత కోసిన విషయం తెలిసిందే. ఒకదశలో మ్యాచ్పై ఆశలే లేని స్థితిలో విరాట్ విజృంభించడంతో దాయాదిపై టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. 8 బంతుల్లో భారత విజయానికి 28 పరుగులు అవసరమైన దశలో హరీస్ రవుఫ్ బౌలింగ్లో కోహ్లీ రెండు భారీ సిక్సర్లు బాది సమీకరణాన్ని సులువు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మరోసారి కూడా అదే జరుగుతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఆసియాకప్ టోర్నీలో టీమ్ఇండియా తొలిపోరులో వచ్చే నెల 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది.