మనీలా: ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పతకం ఖాయం చేసుకుంది. మహిళల సింగిల్స్లో సింధు సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో నాలుగో సీడ్ సింధు 21-9, 13-21, 21-19తో ఐదో సీడ్ హె బింగ్ జియావో (చైనా)పై విజయం సాధించింది. గంటా 16 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో సింధు తన ఆటతీరుతో ఆకట్టుకుంది. తొలి గేమ్ను సునాయాసంగా చేజిక్కించుకున్న తెలుగమ్మాయికి.. మిగిలిన రెండు గేమ్లలో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా.. కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
ఈ టోర్నీ 2014 ఎడిషన్లో కాంస్యం చేజిక్కించుకున్న సింధు.. శనివారం జరుగనున్న సెమీస్లో టాప్ సీడ్ అకానే యామగుచి (జపాన్)తో అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ 21-12, 14-21, 16-21తో ఐదో సీడ్ ఆరోన్ చియా-సో యిక్ (మలేషియా) జంట చేతిలో ఓటమి పాలైంది. ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో భారత్ నుంచి సింధు మాత్రమే పోటీలో ఉంది.