టోక్యో: ఇండియాకు మరో ఈశాన్య భారతీయురాలు ఒలింపిక్స్లో మెడల్ ఖాయం చేసింది. తొలిరోజే మణిపూర్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను సిల్వర్తో మెరవగా.. ఇప్పుడు అస్సాంకు చెందిన బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ( Lovlina ).. క్వార్టర్ఫైనల్లో గెలవడంతో ఇండియాకు కనీసం మరో బ్రాంజ్ మెడల్ అయితే కచ్చితంగా రానుంది. బాక్సింగ్ సెమీఫైనల్లో ఓడిపోయినా బ్రాంజ్ మెడల్ వస్తుంది.
ఒలింపిక్స్ ప్రారంభమయ్యే ముందు మనకు మెడల్ తెచ్చే బాక్సర్ల లిస్ట్లో మేరీకోమ్, అమిత్ పంగాల్, వికాస్ కృష్ణణ్లాంటి వాళ్ల పేర్లు వినిపించినా.. లవ్లీనా పేరు మాత్రం ఎవరికీ తెలియదు. ఎంతో మంది అథ్లెట్లలాగే ఇలా వచ్చి అలా వెళ్లే జాబితాలో ఆమెనూ ఊహించుకున్నారు. కానీ రౌండ్ ఆఫ్ 32లో బై లభించి.. రౌండ్ ఆఫ్ 16లో జర్మనీ బాక్సర్ నదైన్ అపెట్జ్పై గెలవడంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగింది. మరొక్క బౌట్ గెలిస్తే చాలు.. మెడల్ ఖాయమని భావిస్తున్న వేళ ఆమె దానిని చేసి చూపించింది. వచ్చే నెల 4న జరిగే సెమీస్లో టాప్ సీడ్, టర్కీకి చెందిన బాక్సర్ బుసేనాజ్ సూర్మెనెలితో తలపడనుంది. ఇప్పటివరకూ ఒలింపిక్స్లో ఇండియా తరఫున మేరీకోమ్, విజేందర్ సింగ్ మాత్రమే బాక్సింగ్ మెడల్స్ గెలిచారు.
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలోని ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది లవ్లీనా బోర్గోహైన్. ఆమె తండ్రి ఓ చిన్న వ్యాపారి. తల్లి హోమ్ మేకర్. లవ్లీనాకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వాళ్లిద్దరూ జాతీయ స్థాయి మార్షల్ ఆర్టిస్టులు. తాను కూడా వాళ్లిద్దరినీ చూసి 13 ఏళ్ల వయసులోనే ముయ్ థాయ్ నేర్చుకుంది. అయితే దీనిని ఒలింపిక్ క్రీడగా గుర్తించబోరని తెలిసిన తర్వాత ఆమె తన మనసు మార్చుకుంది. లవ్లీనా నిజానికి కిక్ బాక్సింగ్తో కెరీర్ మొదలుపెట్టినా.. తర్వాత బాక్సింగ్ వైపు మళ్లింది. 2017లో జరిగిన ఏషియన్ చాంపియన్షిప్లో బ్రాంజ్మెడల్తో లవ్లీనా తెరపైకి వచ్చింది. గతేడాది మార్చిలో ఏషియా, ఓషియానియా బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నీలో గెలిచి ఒలింపిక్స్కు అర్హత సాధించింది.
ఒలింపిక్స్కు అర్హత సాధించానన్న ఆనందం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. ఆ వెంటే లవ్లీనా కొవిడ్ బారిన పడింది. దీంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) 52 రోజుల అత్యుత్తమ శిక్షణ కోసం యూరప్ పంపిన 16 మంది బాక్సర్ల లిస్ట్లో ఆమె స్థానం కోల్పోయింది. కొవిడ్ సోకినప్పుడు తన శరీరం చాలా బలహీనంగా అయిపోయిందని, అసలు ప్రాక్టీస్ చేయలేకపోయానని లవ్లీనా చెప్పింది. అయితే ధ్యానం చేయడం తనకు బాగా సహకరించిందని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. అస్సాం నుంచి ఇండియాకు ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మహిళా అథ్లెట్ లవ్లీనానే.
వరల్డ్ చాంపియన్షిప్స్: 2018లో వాల్టర్వెయిట్లో బ్రాంజ్మెడల్, 2019లోనూ ఇదే కేటగిరీలో బ్రాంజ్ మెడల్ గెలిచింది.
ఏషియన్ చాంపియన్షిప్స్: 2017లో వాల్టర్వెయిట్లో బ్రాంజ్ మెడల్, 2021లో దుబాయ్లో ఇదే కేటగిరీలో పాల్గొని మరో బ్రాంజ్ గెలిచింది.