Rinku Singh: భారత్ – ఆసీస్ మధ్య విశాఖపట్నం వేదికగా గురువారం ముగిసిన తొలి టీ20లో టీమిండియా యువ సంచలనం రింకూ సింగ్ ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండి 14 బంతుల్లోనే నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులు చేసిన రింకూపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మ్యాచ్ ముగిశాక రింకూపై టీమిండియా మాజీ బౌలర్, గుజరాత్ టైటాన్స్ హెడ్కోచ్ ఆశిష్ నెహ్రా ప్రశంసలు కురిపించాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ వేలంలో అతడిని తన మాతృ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకుంటుందని ఒకవేళ అలా జరగకుంటే మాత్రం మిగతా 9 ఫ్రాంచైజీలు అతడికోసం ఎగబడతాయని అన్నాడు.
గురువారం మ్యాచ్ ముగిసిన తర్వాత కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ రింకూ గురించి మాట్లాడుతూ.. ‘రింకూది సుదీర్ఘమైన ప్రయాణం. అతడు ఈ స్థాయికి చేరడానికి గత ఐదారేండ్లుగా ఎలా కష్టపడుతున్నాడో నాకు తెలుసు..’ అని చెప్పాడు. అక్కడే ఉన్న రింకూ..‘కేకేఆర్తో నా ప్రయాణం 2018లో మొదలైంది. కానీ అప్పుడు నేను ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. ఒకవేళ అది కేకేఆర్ కాకుండా మరేదైనా జట్టు అయితే వాళ్లు కచ్చితంగా నన్ను తీసేసేవారు. కానీ కేకేఆర్ నాకు మద్దతుగా నిలిచింది. అంతేగాక నాయర్ సార్ కూడా నాకు వ్యక్తిగతంగా ఎంతో మద్దతుగా నిలిచారు..’ అని చెప్పాడు.
అదే సమయంలో అక్కడే ఉన్న హోస్ట్ అనంత్ త్యాగి.. ‘జాగ్రత్త రింకూ, మనకు ఇక్కడ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ స్కౌట్స్ ప్యానెల్స్ ఉన్నాయి. వాళ్లు నీ మీద కన్నేశారు..‘ అని అనగానే ఆశిష్ నెహ్రా కల్పించుకుని..‘అతడికి ఇప్పుడు ఏ స్కౌట్స్ అవసరం లేదు. అతడు ఆ స్టేజ్ను ఎప్పుడో దాటేశాడు. వచ్చే వేలంలో కేకేఆర్ నిన్ను వదలదు. వాళ్లు కచ్చితంగా నిన్ను రిటైన్ చేసుకుంటారు. కానీ ఒకవేళ వాళ్లు చేసుకోకుంటే మాత్రం మిగిలిన తొమ్మది ఫ్రాంచైజీలు నిన్ను వదలవు..’అని తెలిపాడు.