టోక్యో: నూట ఇరవైఐదు సంవత్సరాల చరిత్రలో తొలిసారి ప్రతిష్ఠాత్మక ఒలింపిక్ క్రీడలు ప్రేక్షకులు లేకుండా జరుగనున్నాయి. ఖాళీ స్టేడియాల్లో ఎలాంటి హడావుడి లేకుండా ఈ సారి ప్రపంచ క్రీడావేడుకలు సాగనున్నాయి. జపాన్లో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్కు ప్రేక్షకులను అనుమతించబోమని నిర్వాహకులు గురువారం ప్రకటించారు. మరో రెండు వారాల్లో ప్రారంభమయ్యే విశ్వక్రీడలను సురక్షితంగా నిర్వహించే చర్యల్లో భాగంగా టోక్యోలో ఆగస్టు 22 వరకు ఎమర్జెన్సీ విధిస్తూ జపాన్ ప్రధాని యొషిహిండే సుగా నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల్లోనే నిర్వాహకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 23న మొదలయ్యే ఒలింపిక్స్ ఆగస్టు 8 వరకు సాగనున్నాయి. కరోనా నేపథ్యంలో విదేశీ ప్రేక్షకులను ఒలింపిక్స్ అనుమతించబోమని టోక్యో గేమ్స్ నిర్వాహకులు కొన్ని నెలల క్రితమే ప్రకటించగా.. ఇప్పుడు అత్యయిక పరిస్థితి రావడంతో జపాన్ వాసులపైనా నిషేధం ఉండనుంది. ఎమర్జెన్సీ ప్రకటించే కొన్ని గంటల ముందే అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ జపాన్లో అడుగుపెట్టి.. ఐసొలేషన్లోకి వెళ్లాడు. డెల్టా స్ట్రెయిన్ కారణంగా జపాన్లో కరోనా కేసులు మూడు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. మరోవైపు క్రీడా గ్రామంలోనూ కేసులు వెలుగుచూడడంతో నిర్వాహకుల్లో, అథ్లెట్లలో ఆందోళన రేగుతున్నది. దీంతో ఒలింపిక్స్ను సజావుగా నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం, ఐవోసీ, స్థానిక నిర్వాహక కమిటీ కఠిన చర్యలకు సిద్ధమయ్యాయి. గురువారం టోక్యోలో కొత్తగా 896 కేసులు నమోదయ్యాయి.