గ్రీస్: పారిస్లో ఈ ఏడాది జరగనున్న ఒలింపిక్స్ క్రీడల కోసం ఇవాళ ఒలింపిక్ జ్యోతి(Olympic Flame)ని వెలిగించనున్నారు. ప్రాచీన గ్రీసు నగరమైన ఒలింపియాలో ఆ పవిత్ర కార్యాన్ని నిర్వహించనున్నారు. ఒలింపిక్స్ క్రీడలు పుట్టిన ఒలింపియాలో జ్యోతిని ఇవాళ వెలిగించనున్నారు. అక్రాపోలిస్ నుంచి సౌత్ పసిఫిక్ వరకు టార్చ్ ర్యాలీ చేపట్టనున్నారు. గ్రీసులోని పిలోపనీస్ పట్టణంలో జరిగే వేడుకలో పాల్గొనేందుకు వందల సంఖ్యలో ప్రతినిధులు హాజరుకానున్నారు. 776 బీసీలోనే ఒలింపిక్స్ క్రీడలు ఇక్కడ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. సోమవారం గ్రీకు నటి మేరీ మీనా .. ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన రిహార్సల్స్ కార్యక్రమంలో పాల్గొన్నది. 2600 ఏళ్ల క్రితం నాటి హీరా ఆలయం వద్ద జ్యోతిని వెలిగించనున్నారు.
గ్రీకు అధ్యక్షుడు కేటరినా సకెల్లరౌపులో, ఇంటర్నేషణల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఫ్రాన్స్ క్రీడా మంత్రి అమిలీ కాస్టెరా, పారిస్ మేయర్ అన్నే హిడల్గో కూడా హాజరుకానున్నారు. సాధారణంగా ఒలింపిక్ క్రీడల సమయంలో పవిత్ర జ్యోతిని వెలిగిస్తుంటారు. 1936లో జరిగిన బెర్లిన్ క్రీడల సమయంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పునరుద్దరించారు. మాజీ స్విమ్మర్ లౌరీ .. ఒలింపియా వద్ద టార్చ్ బేరర్గా ఉండనున్నారు. 11 రోజుల పాటు గ్రీసులోనే ఒలింపిక్ టార్చ్తో ర్యాలీ నిర్వహించనున్నారు. జూలై 26వ తేదీన పారిస్ క్రీడల సమయంలో మళ్లీ టార్చ్ చేరుకుంటుంది.