యూజీన్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్లో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకబ్ వాద్లెచ్ ఛాంపియన్గా నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్స్లో నీరజ్ చోప్రా జావెలిన్ను 83.80 మీటర్లు విసిరి రెండో స్థానం దక్కించుకున్నాడు. మొదటి, నాలుగో ప్రయత్నాల్లో విఫలమైన నీరజ్.. రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. మూడు, ఐదు, ఆరు ప్రయత్నాల్లో వరుసగా 81.37, 80.74, 80.90 మీటర్ల దూరం ఈటెను విసిరాడు.
చెక్ రిపబ్లిక్ ఆటగాడు జాకబ్ వాద్లెచ్ తన చివరి ప్రయత్నంలో జావెలిన్ను 84.24 మీటర్ల దూరం విసిరి అత్యుత్తమ త్రోను నమోదు చేశాడు. ఫిన్లాండ్కు చెందిన ఆలివర్ హెలాండర్ 80.90 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. కాగా, ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్న నీరజ్ చోప్రా మరోసారి విజేతగా నిలుస్తాడని అంతా భావించారు. కానీ 0.44 మీటర్ల తేడాతో అవకాశం చేజారింది. కాగా, గత ఏడాది జ్యూరిచ్లో జరిగిన డైమండ్ లీగ్లో నీరజ్ టైటిల్ నెగ్గాడు.