వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియాను సెలెక్ట్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుందని మాజీ లెజెండ్, ప్రస్తుతం సఫారీలతో వన్డే సిరీస్లో భారత జట్టు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. భారత జట్టు బెంచ్ సామర్ధ్యం అత్యంత బలంగా ఉందని, యువ ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటున్నారని చెప్పాడు.
దీంతో భారత జట్టు ఎంపిక సెలెక్టర్లకు కష్టంగా మారుతుందన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో రాణించిన సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ను లక్ష్మణ్ కొనియాడాడు. వీళ్లిద్దరూ ఇంకా టీమిండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోలేదని, అయితే సౌతాఫ్రికా మ్యాచ్లో వాళ్లు చూపించిన పరిణితి అభినందనీయమని చెప్పాడు.
‘మన దగ్గర అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ఈ సిరీస్ కోసం వాళ్లంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ల మధ్య పోటీ ఉండటం కూడా మంచిదే. మన దగ్గర ఉన్న ట్యాలెంట్ను చూస్తే.. జట్టు ఎంపిక చేయడానికి బోలెడు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. దీనివల్ల 2023 వన్డే ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది’ అని లక్ష్మణ్ తెలిపాడు.