ODI World Cup | భారత్ ఆడే మ్యాచ్లకు మినహా స్టేడియాలలో ప్రేక్షకులు లేక తంటాలుపడుతున్న వన్డే వరల్డ్ కప్ నిర్వహకులకు పసికూనల అనూహ్య ఫలితాలు ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. వన్డే వరల్డ్ కప్ లో మరో పసికూన అద్భుత ప్రదర్శనతో అగ్రశ్రేణి జట్టుకు ఊహించని షాకిచ్చింది. ధర్మశాల వేదికగా సౌతాఫ్రికా – నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సఫారీలకు ఓటమి తప్పలేదు. వర్షం వల్ల అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ను 43 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా.. 42.4 ఓవర్లలో 207 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా డచ్ 38 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని అందుకుంది.
ఆ జట్టు బౌలర్లు సమిష్టిగా రాణించి నెదర్లాండ్స్కు మరుపురాని విజయాన్ని అందించారు. ఈ వన్డే ప్రపంచకప్లో నెదర్లాండ్స్కు ఇదే తొలి విజయం కాగా రెండు వరుస విజయాల తర్వాత సఫారీలకు తొలి పరాజయం కావడం గమనార్హం. గతేడాది టీ20 ప్రపంచకప్ లో కూడా నెదర్లాండ్స్.. సఫారీలను ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రదర్శనను వన్డే వరల్డ్ కప్ లోనూ ప్రదర్శించింది.
మోస్తారు లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఆది నుంచే తడబడింది. ఓపెనర్ క్వింటన్ డికాక్.. (22 బంతుల్లో 20, 3 ఫోర్లు) మూడు బౌండరీలు కొట్టి జోరుమీద కనిపించినా అతడు ఎక్కువ సేపు క్రీజులో నిలువలేదు. బవుమా (16) మరోసారి విఫలమయ్యాడు.
మిడిలార్డర్ టపటప
వన్ డౌన్ లో వచ్చిన రస్సీ వాన్ డెర్ డసెన్ (4), ఎయిడెన్ మార్క్రమ్ (1)లు కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు. కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్న హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 28, 4 ఫోర్లు) కాసేపు ప్రతిఘటించాడు. డేవిడ్ మిల్లర్ (52 బంతుల్లో 43, 4 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి క్లాసెన్ ఐదో వికెట్కు 45 పరుగులు జోడించాడు. కానీ వాన్ బీక్ బౌలింగ్లో క్లాసెన్ నిష్క్రమించడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. డేవిడ్ మిల్లర్ కూడా క్రీజులో నిలువలేకపోయాడు.
సఫారీ లోయరార్డర్ కూడా పెద్దగా ప్రతిఘటన లేకుండానే నెదర్లాండ్ బౌలర్లకు దాసోహమైంది. గెరాల్డ్ కొయెట్జ్ (22), కేశవ్ మహారాజ్ (37 బంతుల్లో 40, 4 ఫోర్లు)లు కొన్ని మెరుపులు మెరిపించినా అవి ఓటమి అంతరాన్నితగ్గించాయే గానీ దక్షిణాఫ్రికాకు గెలుపును అందించలేదు.