ICC World Cup | అప్పటి వరకు క్రికెట్ మ్యాచ్ అంటే వైట్ డ్రెస్సులు, ఎర్ర బంతులే కాగా.. 1992 వన్డే ప్రపంచకప్తో పరిమిత ఓవర్ల క్రికెట్లో పెను మార్పులు సంభవించాయి. అప్పటికే ఆటను 60 ఓవర్ల నుంచి 50 ఓవర్లకుమార్చగా.. ఈ టోర్నీతో వైట్ బాల్, సైట్ స్క్రీన్ ప్రవేశపెట్టాడంతో పాటు తొలిసారి వరల్డ్కప్ను రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహించారు.
గ్రూప్ దశలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత్ రెండు విజయాలకే పరిమితమై ఇంటిబాట పడితే.. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పాకిస్థాన్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీతోనే బూరబుగ్గల బుల్లోడు ఇంజమామ్ ఉల్ హక్ వెలుగులోకి రాగా.. ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రమ్ తమ స్వింగ్తో యావత్ ప్రపంచాన్ని గడగడలాడించారు. సెమీఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తుచేసిన పాక్.. తుదిపోరులో ఇంగ్లండ్ను మట్టికరిపించి జగజ్జేతగా అవతరించింది. మరో 9 రోజుల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్థాన్ సృష్టించిన ప్రభంజనాన్ని గుర్తుచేసుకుందాం..
బలమైన బౌలింగ్ దళానికి.. మెరుగైన బ్యాటింగ్ నైపుణ్యాలు తోడవడంతో 1992 వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ఎప్పటికప్పుడు నిబంధనలు మార్చుతూ.. ఆటను అభిమానులకు మరింత చేరువ చేసిన ఐసీసీ.. ఈ మెగాటోర్నీతో వన్డేలకు కొత్త కళ తీసుకొచ్చింది. తొలి మూడు ప్రపంచకప్లను ప్రూడెన్షియల్ కప్ పేరిట నిర్వహించగా.. ఆ తర్వాత భారత్ వేదికగా జరిగిన కప్కు రిలయన్స్ స్పాన్సర్గా వ్యవహరించింది. ఇక 92 మెగాటోర్నీ బెన్సన్ హెడ్జెస్ వరల్డ్కప్గా రూపాంతరం చెందగా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయక్తంగా ఆతిథ్యమిచ్చాయి. సాధారణంగా నాలుగేండ్ల కోసారి జరిగే ఈ టోర్నీ తొలిసారి ఐదేండ్ల విరామం అనంతరం నిర్వహించారు. మొత్తం తొమ్మిది జట్లు పాల్గొన్న విశ్వసమరం లీగ్ దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడింట నెగ్గిన న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలువగా.. పాకిస్థాన్ నాలుగో స్థానంలో సెమీఫైనల్కు అర్హత సాధించింది.
అప్పటికే కెప్టెన్గా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పాకిస్థాన్ సారథి ఇమ్రాన్ ఖాన్.. ఈ మెగాటోర్నీకి ముందు మిడిలార్డర్లో ఓ మంచి బ్యాటర్ కావాలని సెలెక్టర్లను కోరాడు. ఆ సమయంలో సలీమ్ మాలిక్, మోయిన్ ఖాన్, జావెద్ మియాందాద్, ఆమిర్ సోహెల్, రమీజ్ రాజా జట్టులో ఉన్నప్పటికీ.. భీకర షాట్లతో విరుచుకుపడ గల ప్లేయన్ కోసం తీవ్రంగా అన్వేషించాడు. ఆ క్రమంలో అతడికి ఇంజమాముల్ హక్ మంచి ప్రత్యామ్నాయంగా కనిపించాడు. ప్రతిభకు పట్టం కట్టడంలో ముందు వరుసలో ఉండే ఇమ్రాన్ ఖాన్ ఆ కుర్రాడికి పెద్దగా అనుభవం లేకున్నా.. మెగాటోర్నీలో విరివిగా అవకాశాలు ఇచ్చాడు.
వచ్చిన చాన్స్లను రెండు చేతులా అందిపుచ్చుకున్న ఇంజీ.. టోర్నీలో దంచికొట్టాడు. జట్టు కోరుకున్న స్థానంలో బ్యాటింగ్కు దిగి కీలక పరుగులతో పాక్ విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో ఇంజీ కొట్టుడుకు కివీస్ బౌలర్లు బిత్తరపోయారు. అప్పటి వరకు హార్డ్ హిట్టింగ్ గురించి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకపోగా.. సెమీస్లో ఇంజమామ్ కేవలం 37 బంతుల్లోనే 60 పరుగులు చేసి కష్టతరమైన లక్ష్య ఛేదనలో పాక్ను గెలిపించాడు. ఇక ఇంగ్లండ్తో జరిగిన తుదిపోరులో.. వసీమ్ అక్రమ్ అటు బ్యాట్తో ఇటు బంతితో అదరగొట్టడంతో పాకిస్థాన్ తొలిసారి విశ్వ విజేతగా అవతరించింది.
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
ఈ ప్రపంచకప్లో పాకిస్థాన్ విజేతగా నిలిచినా.. అభిమానులంతా దక్షిణాఫ్రికా గురించే చర్చించుకున్నారు. సిడ్నీలో జరిగిన సెమీఫైనల్లో మొదట ఇంగ్లండ్ 45 ఓవర్లలో 252 పరుగులు చేయగా.. ఛేదనలో 42.5 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 231/6తో నిలిచింది. అంటే సఫారీ జట్టు విజయానికి 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఈ దశలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించగా.. కాసేపటికి ఆట తిరిగి ప్రారంభం కాగా.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఒక బంతిలో 21 పరుగులుగా సవరించారు. దీంతో దక్షిణాఫ్రికా నిరాశగా వెనుదిరిగింది.