IND vs BAN | భారత్ – బంగ్లాదేశ్ మధ్య పూణే వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్కప్ 17వ లీగ్ మ్యాచ్లో బంగ్లా జట్టు ఎప్పటిలాగే తడబడినా నిలబడింది. మిడిల్ ఓవర్లలో తడబడ్డా ఆఖర్లో పుంజుకంది. ఓపెనర్లు శివాలెత్తినా ఆ తర్వాత భారత బౌలర్లు జోరు పెంచి ఆ జట్టు దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగినా ఆఖర్లో మళ్లీ చేతులెత్తేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. లిటన్ దాస్ (82 బంతుల్లో 66 , 7 ఫోర్లు), తాంజిద్ హసన్ (43 బంతుల్లో 51, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మాత్రమే మెరవగా.. వికెట్ కీపర్ ముష్ఫీకర్ రహీమ్ (46 బంతుల్లో 38, 1 ఫొర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. ఆఖర్లో మహ్మదుల్లా (36 బంతుల్లో 46, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడి బంగ్లా స్కోరును 250 మార్కును దాటించాడు.
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన బంగ్లా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. షకిబ్ అల్ హసన్ గైర్హాజరీలో బంగ్లాదేశ్కు నజ్ముల్ హోసెన్ శాంతో సారథిగా వ్యవహరించాడు. తొలుత ఐదు ఓవర్లలో పరుగులు చేయడానికి తంటాలు పడ్డ ఓపెనర్లు తాంజిద్, లిటన్ దాస్ లు తర్వాత జూలు విదిల్చారు. సిరాజ్, శార్దూల్ లక్ష్యంగా ఓపెనింగ్ జోడీ వీరవిహారం చేసింది.
41 బంతుల్లో అర్థ సెంచరీ చేసుకున్న తాంజిద్.. కుల్దీప్ వేసిన 14.4వ ఓవర్లో ఎల్బీగా నిష్క్రమించాడు. దీంతో 93 పరుగుల తొలి వికెట్ భాగస్వ్యామానికి తెరపడింది. కెప్టెన్ శాంతో (8)ను జడేజా పెవిలియన్కు పంపగా క్రీజులో కుదురుకుంటే ప్రమాదకరంగా మారే మెహిది హసన్ మిరాజ్ను సిరాజ్ తన సెకండ్ స్పెల్ లో తొలి బంతికే ఔట్ చేశాడు. బ్యాట్ లోపల తాకి లెగ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని రాహుల్ పక్కకు డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. లిటన్ దాస్ను కూడా జడ్డూ పెవలియన్కు పంపడంతో బంగ్లా ఆత్మరక్షణలో పడింది. తౌహిద్ హృదయ్ (16)తో కలిసి ఐదో వికెట్ కు 42 పరుగులు జోడించిన ముష్ఫీకర్ బంగ్లా ఇన్నింగ్స్ను చక్కదిద్దేయత్నం చేశాడు. కానీ శార్దూల్ ఠాకూర్ వేసిన 37వ ఓవర్ రెండో బంతికి తౌహిద్.. గిల్ చేతికి చిక్కాడు. ముష్ఫీకర్ కూడా బుమ్రా బౌలింగ్లో జడ్డూకు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు.
ఆఖర్లో మహ్మదుల్లా ధాటిగా ఆడి బంగ్లాకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. మిడిల్ ఓవర్స్లో లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ వేసిన భారత బౌలర్లు.. చివర్లో మళ్లీ చేతులెత్తేయడంతో బంగ్లా పోరాడగలిగే స్కోరును భారత్ ముందు నిలిపింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్ జడేజా రెండు వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్లు తలా వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత్.. 50 ఓవర్లలో 257 పరుగులు చేయాల్సి ఉంది.