భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో వరుసగా రెండు మ్యాచ్లను గెలుచుకుని మూడు రోజుల క్రితమే భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్ జట్టుకు కీలక మ్యాచ్కు ముందు భారీ షాక్ తప్పేలా లేదు. ఈనెల 20న పాకిస్తాన్.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆసీస్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు ముందే పాకిస్తాన్ కీలక ఆటగాళ్లు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు సమాచారం.
భారత్తో అహ్మదాబాద్ వేదికగా ముగిసిన మ్యాచ్ ఓడిన తర్వాత బెంగళూరుకు చేరుకున్న బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాక్ టీమ్లో ప్రధాన పేసర్ అయిన షహీన్ షా అఫ్రిది, అబ్దుల్లా షఫీక్, జమాన్ ఖాన్, ఉసామా మీర్లు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది. మంగళవారం ఉదయం ప్రాక్టీస్ సెషన్లో ప్రధాన ఆటగాళ్లు హాజరుకాలేదు. సాయంత్రం ఆప్షనల్ సెషన్లో కూడా పలువురు డుమ్మాకొట్టారు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేసిన అబ్దుల్లా షఫీక్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. కానీ భారత్ తో మ్యాచ్లో షఫీక్ తేలిపోయాడు. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు వైరల్ ఫీవర్ బారిన పడ్డాడు. షహీన్ షా అఫ్రిది ఈరోజు ఉదయమే కోలుకున్నాడు. అయితే శుక్రవారం నాటికి వీళ్లంతా కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని పాకిస్తాన్ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నది.
ఇక వన్డే ప్రపంచకప్లో ఆడిన తొలి రెండు మ్యాచ్లలోనూ ఓడిన ఆస్ట్రేలియా.. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఘనవిజయాన్ని అందుకుని ఫామ్ లోకి వచ్చింది.