క్రికెట్ అభిమానుల్లో టెస్టులు, వన్డేలపై ఆసక్తి తగ్గి టీ20ల మీద మోజు పెరుగుతున్న నేపథ్యంలో ఏ ఫార్మాట్ అయితే బెటర్ అనేదానిమీద జోరుగా చర్చ నడుస్తున్నది. గత కొద్దిరోజులగా ఇదే విషయమై పలువురు మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. టీ20 క్రికెట్ లో ద్వైపాక్షిక సిరీస్ లను తీసేయాలని.. ఫ్రాంచైజీ క్రికెట్ ను ఆడించాలని రవిశాస్త్రి కామెంట్స్ చేస్తే తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అందుకు విరుద్ధంగా స్పందించాడు.
చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘అభిమానుల ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటే.. టెస్టుల కంటే వన్డేలు బాగా బోరింగ్ ఫార్మాట్ అని నా అభిప్రాయం. అదో అర్థం పర్థం లేని ఫార్మాట్. అసలు దాని గురించి ఎవరూ పట్టించుకోరు. వన్డే సిరీస్ ల గురించి అంతగా గుర్తుంచుకోరు. అది ఇబ్బందుల్లో ఉంది, టీ20 కాదు..
టీ20లు ప్రసారకర్తలకు (బ్రాడ్కాస్టర్స్) అవసరమవుతాయి. లేకుంటే వాళ్లు మీకు డబ్బులు ఇవ్వరు. ప్రతీ దేశం తమ ప్రసారహక్కుల విషయంలో చాలా సంపాదిస్తున్నాయి. టీ20 లలో ద్వైపాక్షిక సిరీస్ లను కొనసాగిస్తేనే బెటర్. ఎందుకంటే ఎప్పుడో రెండేండ్లకోసారి వచ్చే వరల్డ్ కప్ ఆడటానికి ఆటగాళ్లు సిద్ధం కాలేరు కదా.. అందుకు సమయం కూడా ఉండదు..’ అని తెలిపాడు.
ఇటీవలే ఇదే విషయమై రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘ద్వైపాక్షిక సిరీస్ లు దండగ. వాటివల్ల ఉపయోగం లేదు. నేను టీమిండియాకు కోచ్ గా ఉన్న సమయంలో భారత్ చాలా టీ20 మ్యాచులు ఆడింది. కానీ నాకు అందులో ఒక్కటి కూడా గుర్తు లేదు. రెండు దేశాల మధ్య టీ20 క్రికెట్ ఎక్కువ ఆడుతున్నారు. దానికి అంత అవసరం లేదు. క్రికెట్ లో కూడా ఫుట్బాల్ మోడల్ రావాలి. ఫ్రాంచైజీ క్రికెట్ బెటర్. కీలక టోర్నీలు, ప్రపంచకప్ వంటివి మాత్రమే టీ20లలో ఆడాలి..’ అని అన్నాడు.