NZ vs ENG : న్యూజిలాండ్ పర్యటనలో ఇంగ్లండ్కు అదరే ఆరంభం లభించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఆ జట్టు మొదటి టెస్టులో 267 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దాంతో, కివీస్ గడ్డపై టెస్టు విజయం కోసం 15 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఇంగ్లండ్ ఎట్టకేలకు కల నిజం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ నాలుగు వికెట్లతో చెలరేగడంతో ఆతిథ్య న్యూజిలాండ్ కుప్పకూలింది. 126 పరుగులకే ఆలౌట్ అయింది.
తొలి టెస్టులో విజయంతో రెండు టెస్టుల సిరీస్లో పర్యాటక ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 11 టెస్టుల్లో ఆ జట్టుకు ఇది 10వ విజయం కావడం విశేషం. రెండో టెస్టు ఫిబ్రవరి 24న వెల్లింగ్టన్లో జరగనుంది.
మైఖేల్ వాన్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 2008లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. కివీస్ గడ్డపై చివరి సారిగా ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ గెలిచింది అప్పుడే. నాపియర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 121 రన్స్తో విజయం నమోదు చేసింది. మూడు టెస్టుల సిరీస్లో రెండు టెస్టులు నెగ్గి సిరీస్ కైవసం చేసుకుంది. రియాన్ జై సైడ్బాటమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యాడు.
బే ఓవల్ స్టేడియంలో జరిగిన పింక్ బాల్ టెస్టులో బాజ్బాల్ టెక్నిక్తో మరోసారి దుమ్మురేపింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 325-9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. హ్యారీ బ్రూక్ (89) టాప్ స్కోరర్. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ సెంచరీ (138) బాదడంతో కివీస్ 306 పరుగులతో దీటుగా బదులిచ్చింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 374 రన్స్కు ఆలౌట్ అయింది.. రెండో ఇన్నింగ్స్లో కివీస్ బ్యాటర్లు తడబడ్డారు. డారిల్ మిచెల్ ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడాడు. అయితే.. స్టువార్డ్ బ్రాడ్, అండర్సన్ తలా నాలుగు వికెట్లతో విజృంభించడంతో ఆ జట్టు 126 పరుగులకే ఆలౌట్ అయింది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అర్థ సెంచరీ బాదిన హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.