భారత్కు అనూహ్య ఓటమి. కనీసం డ్రా కచ్చితమనుకున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరులో పరాజయం. న్యూజిలాండ్ కఠిన పేస్ సవాల్ ముందు కోహ్లీసేన చతికిలపడింది. పలుమార్లు వర్షం, వెలుతురులేమి కారణంగా రిజర్వ్డే అయిన ఆరో రోజు వరకు సాగిన అల్టిమేట్ టెస్టులో న్యూజిలాండ్ సత్తాచాటింది. తొలిసారి ఐసీసీ నిర్వహించిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ గదను దక్కించుకుంది. 2019 ప్రపంచకప్లో గెలుపు అంచుల వరకు వెళ్లి భంగపడిన ఇంగ్లండ్ గడ్డపైనే విలియమ్సన్ సేన టెస్టు క్రికెట్ జగజ్జేతగా నిలిచింది.
మ్యాచ్ ఐదో రోజు.. రెండు సెషన్లు ముగిశాయి.. అప్పుడు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇక మ్యాచ్ సమమే అనుకున్నారంతా. చివరి సెషన్లోనూ భారత్ రెండు వికెట్లే కోల్పోవడంతో మ్యాచ్ ఫలితం రావడం కష్టమే అనిపించింది. అయితే రిజర్వ్డే అయిన ఆరో రోజు ఆట అనూహ్య మలుపు తిరిగింది. న్యూజిలాండ్ పేస్కు భారత్ వెంటవెంటనే 8 వికెట్లు కోల్పోవడం.. స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ సీనియర్లు కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ సునాయాసంగా ఛేదించడం జరిగిపోయాయి.
బ్యాట్స్మెన్ తప్పిదాలు.. పిచ్ అనుకూలిస్తున్నా పేసర్లు స్థాయి తగ్గట్టు సత్తాచాటలేకపోవడం.. ప్రణాళికలు అమలు చేయలేకపోవడం.. భారత్ ఓటమికి కారణాలయ్యాయి.
సౌతాంప్టన్: తొలి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) టైటిల్ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. వరుణుడి ప్రభావం, అనూహ్య మలుపులతో బుధవారం రిజర్వ్ డే వరకు ఇక్కడ జరిగిన ఫైనల్లో భారత్పై కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టెస్టు క్రికెట్కు ఆదరణ పెంచాలన్న లక్ష్యంతో ఐసీసీ తొలిసారి నిర్వహించిన డబ్ల్యూటీసీ కిరీటాన్ని విలియమ్సన్ సేన అందుకుంది. చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలువని న్యూజిలాండ్.. దాంతో సమానమని ఎందరో భావిస్తున్న డబ్ల్యూటీసీ విజేతగా నిలిచింది. 64/2 ఓవర్ నైట్ స్కోరుతో రిజర్వ్డేలో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటై, కివీస్కు 139 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. రిషబ్ పంత్ (41) మినహా మిలిగిన టీమ్ఇండియా బ్యాట్స్మెన్ అందరూ విఫలమయ్యారు.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ నాలుగు, ట్రెంట్ బౌల్ట్ మూడు, జెమీసన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 45.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 140 పరుగులు చేసిన కివీస్ విజయం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (89 బంతుల్లో 52 నాటౌట్; 8ఫోర్లు), రాస్ టేలర్ (100 బంతుల్లో 47 నాటౌట్; 6ఫోర్లు) అద్భుతంగా ఆడారు. భారత బౌలర్లలో అశ్విన్ మాత్రమే రెండు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా టెస్టు క్రికెట్కు ఆదరణ పెంచేందుకు రెండేండ్ల పాటు 9 జట్ల మధ్య ఐసీసీ నిర్వహించిన తొలి డబ్ల్యూటీసీ కివీస్ హస్తగతమైంది. జెమీసన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
స్వల్ప లక్ష్యఛేదనలో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాస్ టేలర్ అదరగొట్టారు. ఓపెనర్లు టామ్ లాథమ్ (9), డెవోన్ కాన్వే (19)ను భారత స్పిన్నర్ అశ్విన్ ఔట్ చేశాక ఆ ఇద్దరు సత్తాచాటారు. ఆరంభంలో ఆచితూచి ఆడినా ఆ తర్వాత క్రమంగా పరుగులు రాబట్టారు. సాధికారికంగా ఆడుతూ ముందుకు సాగడంతో భారత పేసర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆరంభంలోనే రాస్ టేలర్ ఇచ్చిన క్యాచ్ను పుజార నేలపాలు చేయడంతో పోటీలోకి వచ్చేందుకు భారత్కు మళ్లీ అవకాశమే దక్కలేదు. మొత్తంగా మూడో వికెట్కు అజేయంగా 96 పరుగులు జోడించిన టేలర్, విలియమ్సన్.. జట్టును టెస్టు జగజ్జేతగా నిలిపారు. ఈ క్రమంలో కేన్ 86 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
కీలకమైన తొలి సెషన్లో భారత స్టార్లు విరాట్ కోహ్లీ (13), చతేశ్వర్ పుజార (15), అజింక్య రహానే (15) పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాల్లో పడింది. కివీస్ పొడగరి కైల్ జెమీసన్ బౌలింగ్లో కీపర్ వాట్లింగ్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ వెనుదిరగడంతో ఒక్కసారిగా మ్యాచ్ మారిపోయింది. నయా వాల్ పుజార కూడా వెంటనే ఔటవడంతో 72 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత పంత్తో వైస్ కెప్టెన్ రహానే (15) కలిసి ఇన్నింగ్స్ను నిలిపే ప్రయత్నం చేశాడు. అయితే లెగ్సైడ్ వేసిన బంతిని మరోసారి ఆడి రహానే ఔటయ్యాడు. ఆ తర్వాత పంత్కు జడేజా (16) చక్కటి సహకారం అందించడంతో 130/5 వద్ద భారత్ లంచ్ విరామానికి వెళ్లింది. అనంతరం కీపర్కు క్యాచ్ ఇచ్చి జడ్డూ పెవిలియన్ చేరాడు. అనంతరం అశ్విన్ (7) కాసేపటికే ఔటవగా.. మరో ఎండ్లో పంత్ సమరం కొనసాగించాడు. అయితే ఈ క్రమంలో బౌల్ట్ బౌలింగ్లో భారీ షాట్కు పోయి క్యాచ్ ఔటయ్యాడు. చివర్లో షమీ (13) విలువైన పరుగులు చేయడం భారత్కు 138 పరుగుల ఆధిక్యమైనా వచ్చింది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 217,
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 249. భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (ఎల్బీడబ్ల్యూ) సౌథీ 30, గిల్ (ఎల్బీడబ్ల్యూ) సౌథీ 8, పుజార (సి) టేలర్ (బి) జెమీసన్ 15, కోహ్లీ (సి) వాట్లింగ్ (బి) జెమీసన్ 13, రహానే (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 15, పంత్ (సి) నికోల్స్ (బి) బౌల్ట్ 41, జడేజా (సి) వాట్లింగ్ (బి) వాగ్నర్ 16, అశ్విన్ (సి) టేలర్ (బి) బౌల్ట్ 7, షమీ (సి) లాథమ్ (బి) సౌథీ 13, ఇషాంత్ (నాటౌట్) 1, బుమ్రా (సి) లాథమ్ (బి) సౌథీ 0. ఎక్స్ట్రాలు: 11. మొత్తం: 73 ఓవర్లలో 170 ఆలౌట్. వికెట్ల పతనం: 1-24, 2-51, 3-71, 4-72, 5-109, 6-142, 7-156, 8-156, 9-170, 10-170; బౌలింగ్: సౌథీ 19-4-48-4, బౌల్ట్ 15-2-39-3, జెమీసన్ 24-10-30-2, వాగ్నర్ 15-2-44-1.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: టామ్ లాథమ్ (స్టంప్) పంత్ (బి) అశ్విన్ 9, కాన్వే (ఎల్బీడబ్ల్యూ) అశ్విన్ 19, విలియమ్సన్ (నాటౌట్) 52, టేలర్ (నాటౌట్) 47. ఎక్స్ట్రాలు: 13. మొత్తం: 45.5 ఓవర్లలో 140/2. వికెట్ల పతనం: 1-33, 2-44. బౌలింగ్: ఇషాంత్ 6.2-2-21-0, షమీ 10.5-3-31-0, బుమ్రా 10.4-2-35-0, అశ్విన్ 10-5-17-2, జడేజా 8-1-25-0.