లండన్: వింబుల్డన్(Wimbeldon) మెన్స్ ఫైనల్లో నోవాక్ జోకోవిచ్(Novak Djokovic) ప్రవర్తన ప్రేక్షకుల్ని విసుగెత్తించింది. అల్కరాజ్తో జరిగిన ఆ మ్యాచ్లో టైటిల్ నెగ్గేందుకు జోకోవిచ్ తీవ్ర ప్రయత్నం చేశాడు. రసవత్తరంగా సాగిన ఆ మ్యాచ్లో అల్కరాజ్(Alcaraz) విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే సర్వ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుని అనేక సార్లు జోకోవిచ్ రూల్స్ బ్రేక్ చేశాడు. 24వ గ్రాండ్స్లామ్ టైటిల్ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న జోకోవిచ్ .. ఆదివారం జరిగిన మ్యాచ్లో సర్వ్ చేసేందుకు ఎక్కువ టైం తీసుకున్నాడు. రెండో సెట్లో అతను తొలి సర్వ్, రెండో సర్వ్ మధ్య మరీ ఎక్కువ సమయం తీసుకున్నాడు. దీంతో ఓ దశలో అంపైర్ ఫెర్గస్ మర్ఫీ అతనికి వార్నింగ్ కూడా ఇచ్చాడు.
సాధారణంగా రెండు సర్వ్ల మధ్య 25 సెకన్లు బ్రేక్ తీసుకునే అవకాశం కల్పిస్తారు. ఇక వింబుల్డన్ సెంటర్ కోర్టులో ఉంటే టైమ్ క్లాక్ ఆ సమయాన్ని ఎప్పుడూ చూపిస్తుంటుంది. కానీ అల్కరాజ్తో జరిగిన మ్యాచ్లో అలసిపోయిన జోకోవిచ్ పదేపదే సర్వ్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నాడు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇండియన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) కూడా ట్వీట్ చేశాడు. సమయాన్ని ఉల్లంఘించినట్లు జోకోవిచ్పై సెటర్ వేశాడు అశ్విన్. ఆ ట్వీట్లో దండం పెట్టే ఎమోజీలను కూడా జత చేశాడు. అయితే రెండో సెట్లో ఓ దశలో జోకోవిచ్ 33 సెకన్ల సమయాన్ని తీసుకున్నాడు. మరో వైపు అల్కరాజ్ మాత్రం 27 సెకన్లలోపే రెండో సర్వ్ చేశాడు.
Time violation 👏👏 #NovakDjokovic #wimbledon2023
— Ashwin 🇮🇳 (@ashwinravi99) July 16, 2023
జోకోవిచ్పై అంపైర్ మర్ఫీ జరిమానా విధించడంతో.. ప్రేక్షకులు ఆ సందర్భంలో అరుపులు, కేకలు పెట్టారు. మ్యాచ్ను గెలిచేందుకు జోకోవిచ్ తనకు తోచిన రీతిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు కొందరు కామెంట్ చేశారు. సర్వ్ను ఆలస్యం చేస్తే.. అప్పుడు మ్యాచ్ జోకోవిచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయని కొందరన్నారు. జోకోవిచ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వరుసగా అయిదోసారి వింబుల్డన్ గెలవాలన్న అతని కల నెరవేరలేదు. కానీ థ్రిల్లింగ్గా సాగిన మ్యాచ్లో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ విజయం సాధించాడు. అల్కరాజ్కు ఇది రెండో గ్రాండ్స్లామ్ కావడం విశేషం.