అంతర్జాతీయ వేదికపై తెలంగాణ క్రీడాతార తళుక్కుమన్నది. మేటి బాక్సర్లకు తాను ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తూ తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ కొత్త చరిత్ర లిఖించింది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ అప్రతిహత విజయాలతో ప్రపంచ బాక్సింగ్ విజేతగా ఆవిర్భవించింది. తన పంచ్ పవర్కు తిరుగులేదని నిరూపిస్తూ టర్కీ గడ్డపై మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ గెలువడంలో నాకు వెన్నంటి నిలిచిన అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా అనుక్షణం మద్దతుగా నిలిచిన సాయ్, అజయ్ సర్, భాస్కర్ భట్, కోచ్లకు ధన్యవాదాలు. వీళ్లందరి సహకారం వల్లే నేను ప్రపంచ చాంపియన్గా నిలిచాను. వరల్డ్ బాక్సింగ్ టైటిల్తో నా కల నెరవేరినా.. పారిస్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించడం లక్ష్యం. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.
– నిఖత్ జరీన్
పసిడి పతక పోరులో థాయ్లాండ్ బాక్సర్ జిట్పాంగ్ జుటామస్ను మట్టికరిపించిన నిఖత్ చరిత్రాత్మక విజయంతో కదంతొక్కింది. ఆది నుంచే ప్రత్యర్థిపై సివంగిలా విరుచుకుపడ్డ ఈ ఇందూరు బాక్సర్ కొట్టిన పంచ్లకు థాయ్ బాక్సర్ దిమ్మతిరిగిపోయింది. కచ్చితమైన షాట్లతో విరుచుకుపడ్డ నిఖత్ ఎక్కడా వెనుకకు తగ్గకుండా మూడు రౌండ్ల పాటు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. రౌండ్ రౌండ్కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయిన ఈ తెలంగాణ బాక్సర్కు దీటైన పోటీనిచ్చేందుకు జిట్పాంగ్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ప్రత్యర్థి దురుసుగా పంచ్లు విసురుతున్నా..ఏకాగ్రతను కోల్పోని జరీన్ పదునైన పంచ్లకు తోడు క్లీన్ హుక్స్, జాబ్స్తో పాయింట్లు కొల్లగొట్టింది. ఈ క్రమంలో దిగ్గజ బాక్సర్లు మేరీకోమ్, సరితాదేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీ తర్వాత ప్రపంచ బాక్సింగ్ టైటిల్ గెలిచిన ఐదో భారత బాక్సర్గా నిఖత్ అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది.
చరిత్రాత్మక విజయం సాధించిన నిఖత్పై ప్రశంసల వర్షం కురిసింది. సీఎం కేసీఆర్, మంత్రులు శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ చీఫ్ విప్ బాల్కసుమన్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రపంచవేదికపై తెలంగాణ బావుటను ఎగరేసిన నిఖత్ జరీన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
భారత బాక్సింగ్ క్రీడా చరిత్రలో మరుపురాని రోజు. అంచనాలు లేకుండా బరిలోకి దిగి అజేయ ప్రస్థానంతో అద్భుత విజయం సొంతం చేసుకున్న వైనం. భారతావని మది ఉప్పొంగిపోయే సందర్భం. ప్రపంచ వేదికపై తెలంగాణ క్రీడాతార నిఖత్జరీన్ పసిడి కాంతులు విరజిమ్మింది. గెలుపును తన చిరునామాగా మార్చుకున్న ఈ ఇందూరు బాక్సర్ టర్కీలో కొత్త చరిత్ర లిఖించింది.
పోరాడితే పోయేది ఏమి లేదు అన్న రీతిలో ప్రత్యర్థులపై విరుచుకుపడిన నేపథ్యం. వెరసి మేటి బాక్సర్లకు తాను ఏమాత్రం తీసిపోనంటూ ఘనంగా చాటిచెప్పిన క్రమం. థాయ్లాండ్ బాక్సర్ను మట్టికరిపించిన నిఖత్ చిరస్మరణీయ విజయంతో ఆకట్టుకుంది. ప్రపంచ బాక్సింగ్ టైటిల్ గెలిచిన తొలి తెలంగాణ బాక్సర్గా నిలిచిన జరీన్పై ప్రశంసల వర్షం కురుస్తున్నది. సీఎం కేసీఆర్ మొదలు మంత్రులు అభినందనల వెల్లువలో ముంచెత్తారు.
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడి కాంతులు విరబూసింది. మెగాటోర్నీలో అపజయమెరుగని నిఖత్ అద్భుత విజయంతో యావత్ దేశం గర్వపడేలా చేసింది. గురువారం ఇస్తాంబుల్ వేదికగా జరిగిన మహిళల 52కిలోల ఫైనల్ పోరులో నిఖత్ 5-0 తేడాతో థాయ్లాండ్ బాక్సర్ జిట్పాంగ్ జుటామస్పై చిరస్మరణీయ విజయం సాధించింది. మూడు రౌండ్ల పాటు జరిగిన పసిడి పోరులో జరీన్ 30-27, 29-28, 29-28, 30-27, 29-28తో జిట్పాంగ్ సంపూర్ణ ఆధిక్యంతో గెలుపును ఖరారు చేసుకుంది.
తొలి రౌండ్ నుంచి తనదైన ఆధిక్యం కనబరిచిన ఈ ఇందూరు బాక్సర్ ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా పదునైన పంచ్లతో విరుచుకుపడింది. టెక్నిక్కు కట్టుబడుతూ క్లీన్పంచ్లతో చెలరేగిన నిఖత్ రౌండ్ రౌండ్కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది. తొలి రౌండ్లో 30 పాయింట్లు ఖాతాలో వేసుకున్న జరీన్ మళ్లీ వెనుదిరిగి చూడలేదు. అదే జోరు కొనసాగిస్తూ రెండో రౌండ్లో మరింత దూకుడు కనబర్చడంతో థాయ్ బాక్సర్ దగ్గర సరైన బదులు ఇవ్వలేకపోయింది. అయితే ఆఖరిదైన మూడో రౌండ్లో జిట్పాంగ్ పుంజుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దురుసైన ఆటతో నిఖత్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించినా.. ఆమె ఆటలు సాగలేదు.
ప్రత్యర్థి ఎంత కవ్విస్తున్నా.. వెరువని నైజంతో ముందుకు సాగిన నిఖత్ విజయంపై ఆత్మవిశ్వాసంతో కనిపించింది. బౌట్ ముగిసి రిఫరీ విజేతను ప్రకటించగానే జరీన్ దిక్కులు పిక్కటిల్లేలా విజయనాదం చేసింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అందరికీ అభివాదం చేసింది. చిరకాల కల సాకారమైన వేళ నిఖత్ గెలుపు గర్వంతో అభిమానులకు చేతులు ఊపుతూ ముందుకు సాగింది. మొత్తంగా ప్రపంచ బాక్సింగ్ టైటిల్ దక్కించుకున్న తొలి తెలుగు బాక్సర్గా నిఖత్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఓవరాల్గా మెగాటోర్నీలో నిఖత్కు స్వర్ణం దక్కగా, పర్వీన్, మనీషాకు కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. మొత్తం పదకొండు ఎడిషన్లలో బరిలోకి దిగిన భారత్ ఇప్పటి వరకు 39 పతకాలు సొంతం చేసుకుంది. ఇందులో 10 స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, 21 కాంస్య పతకాలు ఉన్నాయి.
ప్రభుత్వ ప్రోత్సాహం అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో ప్రపంచ విజేతగా నిలువడం గర్వించదగ్గ విషయం. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.
– సీఎం కేసీఆర్
చాంపియన్ నిఖత్ జరీన్కు శుభాకాంక్షలు. నిఖత్ పోరాటం స్ఫూర్తిదాయకం. ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన ప్రోత్సాహంతో నిఖత్ జాతీయ స్థాయిలో తెలంగాణ పేరును మార్మోగించింది. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలి.
– హరీశ్రావు, తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి
ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్కు హృదయ పూర్వక శుభాకాంక్షలు.
– శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి
నిఖత్ బంగారు పతకం సాధించడం హర్షణీయం. ఆమె విజయంతో తెలంగాణ, నిజామాబాద్ జిల్లా కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచ నలుదిశలా వ్యాపించాయి. సీఎం కేసీఆర్ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని చెప్పడానికి నిఖత్ విజయమే నిదర్శనం. జరీన్కు వ్యక్తిగతంగా రూ.లక్ష నగదు ప్రోత్సాహకం అందిస్తా.
– ప్రశాంత్రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి
తెలంగాణ పేరును సగర్వంగా నిలిపిన నిఖత్కు శుభాకాంక్షలు. అన్ని రంగాల్లో అగ్రపథాన దూసుకెళ్తున్న తెలంగాణ.. నిఖత్ విజయంతో క్రీడా రంగంలోనూ సగర్వంగా నిలుస్తున్నది.
– కమలాకర్, పౌర సరఫరాల శాఖ మంత్రి
ప్రపంచ చాంపియన్గా నిలిచిన నిజామాబాద్ బిడ్డ జరీన్కు శుభాకాంక్షలు. నీ విజయం మా అందరికీ గర్వకారణం.
– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
జరీన్కు సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత అన్ని విధాలా సహాయం చేశారు. కేసీఆర్ సార్, కవితమ్మకు కృతజ్ఞతలు.
– పర్వీన్ సుల్తానా, జరీన్ తల్లి