అనుకున్నదే జరిగింది. ఎప్పుడైతే భారత్ టాస్ ఓడిందో అప్పుడే మ్యాచ్ చేజారిపోయిందని అంతా అనుకున్నట్టే భారత్ చేతుల్లోంచి మ్యాచ్ చేజారిపోయింది. 110 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 14.3 ఓవర్లలోనే ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే.. 8 వికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముందు బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన న్యూజిలాండ్ అలవోకగా ఇండియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో మిచెల్ ఎక్కువ స్కోర్ చేశాడు. 35 బంతుల్లో 49 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ 31 బంతుల్లో 33 పరుగులు చేశాడు. గప్తిల్.. 17 బంతుల్లో 20 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు.
4 ఓవర్లు వేసి భారత్కు 17 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన ఇష్ సోధీని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
గ్రూప్ 2లో ప్రస్తుతం పాకిస్థాన్ టాప్లో ఉండగా.. ఆప్ఘనిస్థాన్ రెండో ప్లేస్లో ఉంది. మూడో ప్లేస్లో ఉన్న నమీబియాను వెనక్కి నెట్టి.. న్యూజిలాండ్ మూడో స్థానానికి ఎగబాకి సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది. తర్వాత రాబోయే మ్యాచుల్లోనూ న్యూజిలాండ్ మెరుగైన ప్రదర్శన కనబరిస్తే.. పాక్ తర్వాత సెమీస్కు అర్హత సాధించే మరో టీమ్గా న్యూజిలాండ్ నిలవనుంది.
భారత్.. సెమీస్ ఆశలను ఇక వదిలేసుకోవాల్సిందే. ప్రస్తుతం భారత్.. గ్రూప్ 2లో ఐదో ప్లేస్లో ఉంది. రెండు మ్యాచ్లలోనూ ఓడిపోవడంతో పాటు.. జీరో పాయింట్లతో.. మైనస్ 1.609 నెట్ రన్ రేట్తో భారత్ ఉంది. భారత్ ఇంకో మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
భారత్ తరువాతి మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్తో జరగనుంది. నవంబర్ 3న ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత నవంబర్ 5న స్కాట్లాండ్తో జరగనుంది. నవంబర్ 8న నమీబియాతో జరగనుంది. భారత్ తర్వాత ఆడబోయే మ్యాచ్లన్నీ పసికూనలతోనే. కానీ.. ఈ మూడు టీమ్లపై భారత్ గెలిచినా.. సెమీస్కు చేరడం కష్టంగానే ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే భారత్ సెమీ ఫైనల్స్కు చేరడం అసాధ్యం.