T20 WC 2024 : క్రికెట్లో పొట్టి ఫార్మాట్(T20s)కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. అందులోనూ టీ20 వరల్డ్ కప్(T20 World Cup) అంటే అభిమానులకు పండుగే. అందుకనే ఈ మెగా టోర్నీ మ్యాచ్లు తమ సిటీలో జరిగితే బాగుండనీ అందరూ అనుకుంటారు. అయితే.. ఓ అమెరికా లెజిస్లేటర్ తమ ప్రాంతంలో పొట్టి ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడించాలని ఐసీసీని అభ్యర్థించింది. న్యూయార్క్(New York) ప్రజాపత్రినిధి అయిన ఆమె పేరు.. జెన్నిఫర్ రాజ్కుమార్(Jenifer Rajkumar). భారతీయ అమెరికన్ అయిన ఆమె అందుకు కారణం ఏం చెప్పిందంటే..?
‘మా ప్రాంతంలో దక్షిణాసియా దేశాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ముఖ్యంగా వెస్టిండీస్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పాటు ఆఫ్రికాకు చెందిన వాళ్లు ఎక్కువ. అందుకని వరల్డ్ కప్ ఆడే ప్రతి జట్టుకు ఇక్కడ అభిమానుల మద్దతు లభిస్తుంది. న్యూయార్క్ రాష్ట్ర ఆఫీసుకు ఎన్నికైన మొదటి భారతీయ మహిళను నేను. మా సిటీలోని వాళ్లకు క్రికెట్ అంటే ఎంతిష్టమో నాకు తెలుసు’ అని జెన్నిఫర్ వెల్లడించింది.
వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ పోటీలకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. దాంతో, ఐసీసీ బృందం ఈమధ్యే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్న స్టేడియాలను పరిశీలించింది. అందులో న్యూయార్క్ కూడా ఒకటి. 2024 జూన్ నెలలో ప్రపంచ కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఈ పోటీలకు 20 జట్లు అర్హత సాధించాయి.