Neeraj Chopra | న్యూఢిల్లీ: బుడాపెస్ట్(హంగరీ) వేదికగా ఈ నెల 19 నుంచి మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్చోప్రా నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. మెగాటోర్నీలో భారత్ 28 మందితో కూడిన జట్టుతో పోటీ పడుతున్నది. హంగరీ వాతవరణానికి అలవాటు పడేందుకు ఇప్పటికే కొంత మంది అథ్లెట్లు అక్కడికి చేరుకున్నారు.
ఈ సీజన్లో రెండు డైమండ్ లీగ్లను దక్కించుకున్న నీరజ్ మరోమారు సత్తాచాటాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ పతకాలు కొల్లగొడుతున్న ఆంధ్రప్రదేశ్ యువ అథ్లెట్ యర్రాజీ జ్యోతి 100మీటర్ల హర్డిల్స్లో పోటీకి దిగనుంది. జ్యోతితో పాటు పారుల్ చౌదరీ, శైలిసింగ్, అన్నురాణి, భావన జాట్ వేర్వేరు విభాగాల్లో పతక వేట మొదలుపెట్టనున్నారు. మరోవైపు తజిందర్పాల్సింగ్, తేజస్విన్ శంకర్, కేఎమ్ చంద, ప్రియాంక గోస్వామి ఈ టోర్నీకి దూరమయ్యారు.