హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ మరో జాతీయస్థాయి టోర్నీకి వేదిక కాబోతున్నది. కరోనా వైరస్ విజృంభణతో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన క్రీడా టోర్నీల పునరుద్ధరణ మళ్లీ ఊపందుకుంది. ఈ క్రమంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియం, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ వేదికలుగా గురువారం నుంచి 37వ జాతీయ సబ్జూనియర్ బాలుర చాంపియన్షిప్ మొదలవుతున్నది. ఈ టోర్నీలో మొత్తం 24 జట్లు పోటీపడుతున్నాయి. ఆతిథ్య తెలంగాణ సహా ఆంధ్రపదేశ్, ఢిల్లీ, కేరళ, పంజాబ్, జమ్ము కశ్మీర్, కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, డామన్ డయ్యూ, చండీగఢ్ బరిలో ఉన్నాయి. 24 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించారు. పూల్-సిలో తెలంగాణ, మణిపూర్, మధ్యప్రదేశ్ కొలువు దీరాయి. పోటీల తొలి రోజైన గురువారం సాయంత్రం తెలంగాణ, మణిపూర్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది. పోటీల ప్రారంభోత్సవానికి రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు తదితరులు పాల్గొంటారని జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. రాష్ట్ర క్రీడాశాఖ, సాట్స్ సహకారంతో జాతీయ హ్యాండ్బాల్ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు జగన్ తెలిపారు.