ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి/ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ మరో జాతీయస్థాయి క్రీడా టోర్నీకి వేదికైంది. శనివారం ఉస్మానియా యూనివర్సిటీ వెలోడ్రమ్లో 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే టోర్నీలో దేశంలోని 27 రాష్ర్టాల నుంచి దాదాపు 700 మంది సైక్లిస్టులు పోటీపడుతున్నారు. జాతీయ, రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సాట్స్ సహకారంతో టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు జరిగిన వేర్వేరు విభాగపు పోటీల్లో కీర్తి రంగస్వామి, ఆకాశ్, ఆయూష్, అదితి, సూర్య, శశికళ విజేతలుగా నిలిచారు.