పోచెఫ్స్ట్రోమ్: ప్రతిష్ఠాత్మక జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్కు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో ఇంగ్లండ్తో పోరాడి ఓడింది. 2013లో ఇదే టోర్నీలో తమను ఓడించిన భారత్పై ప్రతీకారాన్ని తీర్చుకున్న ఇంగ్లండ్ కాంస్యాన్ని చేజిక్కించుకుంది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు సమమైన వేళ నిర్వహించిన షూటౌట్లో భారత్ 0-3తో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్ విషయానికొస్తే ఇరు జట్లు నిర్ణీత సమయంలో 2-2తో స్కోర్లు సమం చేశాయి. భారత్ తరఫున టోర్నీ టాప్ స్కోరర్ ముంతాజ్ ఖాన్ 21, 47 నిమిషాల్లో రెండు గోల్స్తో విజృంభించింది. ఇంగ్లండ్ తరఫున మిల్లీ గిగ్లియో (18 ని), క్లౌడియా స్వైన్ (58 ని) గోల్స్ చేశారు. అనంతరం నిర్వహించిన షూటౌట్లో షర్మిలాదేవి, సలీమా టెటె, సంగీత కుమారి విఫలమవగా.. ఇంగ్లండ్ తరఫున కటె కర్టిస్, స్వైన్, మాడి ఆక్స్ఫర్డ్ గోల్స్ చేసి మ్యాచ్ను సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీలో ఓటమన్నది ఎరుగకుండా నాకౌట్కు చేరిన భారత జట్టు క్వార్టర్స్లో కొరియాను చిత్తు చేయగా.. సెమీస్లో మాత్రం నెదర్లాండ్స్ చేతిలో ఓటమి ఎదుర్కొంది.