అట్టహాసంగా ప్రారంభమైన మహిళల ప్రీమియర్ లీగ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. అతిరథ మహారథుల మధ్య ప్రారంభమైన డబ్యూపీఎల్ రెండో సీజన్లో హర్మన్ప్రీత్ సారథ్యంలోని ముంబై చివరి బంతికి సిక్సర్ బాది శుభారంభం చేసింది.
WPL | బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో తొలి విజయం నమోదు చేసుకుంది. నిరుడు జరిగిన తొలి సీజన్కు మంచి ప్రేక్షకాదరణ దక్కడంతో.. ఈ సారి నిర్వాహకులు అంతకుమించిన రీతిలో ఆరంభ వేడుకలు నిర్వహించారు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి పోరులో హర్మన్ప్రీత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అలీస్ కాప్సీ (75; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. జెమీమా రోడ్రిగ్స్ (24 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టింది. ముంబై బౌలర్లలో స్కీవర్ బ్రంట్, అమెలియా కెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా.. సంజన సిక్సర్ కొట్టి ముంబైని గెలిపించింది. ఢిల్లీ బౌలర్లలో హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి, కాప్సీ చెరో 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. లీగ్లో భాగంగా శనివారం యూపీ వారియర్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది.
మ్యాచ్ ఆరంభానికి ముందు.. నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను కట్టపడేశాయి. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, షాహిద్కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, కార్తిక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ ప్రదర్శనలతో స్టేడియం హోరెత్తింది. అనంతరం ఐదుగురు కెప్టెన్లు ప్రత్యేక వాహనాల్లో స్టేజి మీదకు చేరుకోగా.. చివరగా వచ్చిన ముంబై ఇండియన్స్ సారథి హర్మన్ప్రీత్ కౌర్ ట్రోఫీని తీసుకువచ్చింది. ఈ క్రమంలో కెప్టెన్లతో షారుక్ఖాన్ చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఐపీఎల్ చైర్మన్ అరున్ ధుమాల్, రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ: 171/5 (కాప్సీ 75, జెమీమా 42; స్కీవర్ బ్రంట్ 2/33), ముంబై: 20 ఓవర్లలో 173/6 (యస్తిక 57, హర్మన్ 55; కాప్సీ 2/23).