WPL 2023 | మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై తుదిపోరుకు అర్హత సాధించింది. లీగ్ దశలో దుమ్మురేపిన హర్మన్ప్రీత్ బృందం.. ఎలిమినేటర్లోనూ అదే జోష్తో యూపీ వారియర్స్ను చిత్తు చేసి టైటిల్ పోరుకు చేరింది. బ్యాటింగ్లో స్కీవర్ బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ స్కోరు అందించగా.. బౌలింగ్లో ఇస్సీ వాంగ్ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు పడగొట్టింది. ఆదివారం జరుగనున్న తుదిపోరులో ఢిల్లీతో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది!
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)తొలి సీజన్లో ముంబై ఇండియన్స్ ఫైనల్కు దూసుకెళ్లింది. సీజన్ ఆరంభం నుంచి చక్కటి ప్రదర్శనతో సత్తాచాటిన ముంబై.. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్లో 72 పరుగుల తేడాతో యూపీ వారియర్స్ను చిత్తు చేసింది. ఆదివారం జరుగనున్న తుదిపోరులో ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ట్రోఫీ కోసం తలపడనుంది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. స్కీవర్ బ్రంట్ (38 బంతుల్లో 72 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా.. అమెలియా కెర్ (29; 5 ఫోర్లు), హీలీ మాథ్యూస్ (26; 2 ఫోర్లు, ఒక సిక్సర్), యస్తిక భాటియా (21; 4 ఫోర్లు), హర్మన్ప్రీత్ కౌర్ (14) తలా కొన్ని పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో సోఫియా ఎకెల్స్టోన్ రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో వారియర్స్ 17.4 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌటైంది. కిరణ్ నవగిరె (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో ఇస్సీ వాంగ్ ‘హ్యాట్రిక్’ సహా నాలుగు వికెట్లు పడగొట్టగా.. సైకా ఇషాఖ్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకుంది. స్కీవర్ బ్రంట్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రాతో పాటు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించారు.
లీగ్ దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఆరింట నెగ్గిన ముంబై ఇండియన్స్ నెట్ రన్రేట్లో స్వల్ప తేడాతో నేరుగా ఫైనల్కు అర్హత సాధించలేకపోయింది. పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మెగా ఫైట్కు దూసుకెళ్లగా.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ముంబై, యూపీ మధ్య జరిగిన పోరులో ముంబైదే పైచేయి అయింది. టాస్ కలిసి రాకపోయినా.. ఓపెనర్లు యస్తిక భాటియా, హీలీ మాథ్యూస్ జట్టుకు మెరుగైన ఆరంభం అందించారు. తొలి వికెట్కు 31 పరుగులు జోడించిన అనంతరం యస్తిక ఔటైనా.. స్కీవర్ క్రీజులో అడుగుపెట్టడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాజేశ్వరి గైక్వాడ్ క్యాచ్ మిస్ చేయడంతో బతికిపోయిన స్కీవర్ చివరి వరకు దంచుడు కొనసాగించింది. ఒకవైపు హీలీ మాథ్యూస్, హర్మన్ప్రీత్ వికెట్లు కోల్పోయినా ఏమాత్రం వెనక్కి తగ్గని స్కీవర్.. వీలు చిక్కనప్పుడల్లా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఆమెకు అమెలియా కెర్ నుంచి చక్కటి సహకారం లభించగా.. ఆఖరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన పూజ వస్ర్తాకర్ (4 బంతుల్లో 11 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) విలువైన పరుగులు జోడించడంతో ముంబై భారీ స్కోరు చేయగలిగింది.
అనంతరం లక్ష్యఛేదనలో యూపీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెప్టెన్ అలీసా హీలీ (11) ఎక్కువసేపు నిలువలేకపోగా.. శ్వేత షెరావత్ (1), తహిలా మెక్గ్రాత్ (7) విఫలమయ్యారు. దీంతో యూపీ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కిరణ్ నవగిరె కాస్త పోరాడింది. గ్రేస్ హారిస్ (14), దీప్తి శర్మ (16) అండతో జట్టును విజయ తీరాలకు చేర్చేందుకు ప్రయత్నించినా.. ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి యూపీవారియర్స్ను దెబ్బకొట్టారు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఇస్సీ వాంగ్ హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. రెండో బంతికి కిరణ్ ఔట్ కాగా.. ఆ తర్వాత వరుసగా సిమ్రన్ (0), సోఫియా (0) పెవిలియన్ బాటపట్టారు. దీంతో యూపీ పరాజయం ఖాయమైంది.
ముంబై: 20 ఓవర్లలో 182/4 (స్కీవర్ బ్రంట్ 72 నాటౌట్, అమెలియా కెర్ 29; సోఫియా ఎకెల్స్టోన్ 2/39), యూపీ: 17.4 ఓవర్లలో 110 (కిరణ్ నవగిరె 43, దీప్తి 16; వాంగ్ 4/15, సైకా 2/24).