క్రికెట్ ఆట ఎంత వినోదాన్ని పంచినా తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే అది ఎంత క్రూయల్ గేమ్ అనేది మరోసారి నిరూపితమైంది. ఫీల్డింగ్ చేస్తుండగా ఓ వ్యక్తికి బంతి బలంగా తాకి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. బ్యాటర్ కొట్టిన బంతి వేగంగా వచ్చి తలను తాకడంతో జయేశ్ సావ్లా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ముంబైలోని దాద్కర్ మైదానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. దాద్కర్ మైదానంలో కుచ్చీ వీసా ఓస్వల్ వికాస్ లెజెండ్ కప్ ఆడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. 50 ఏండ్లకు పైబడిన వ్యక్తులే ఈ టోర్నీ ఆడుతున్నారు. టీ20 ఫార్మాట్లో ఆడుతున్న ఈ టోర్నమెంట్తో పాటు ఇదే మైదానంలో పక్కనే ఉన్న పిచ్పై మరో మ్యాచ్ (లోకల్ గ్రౌండ్స్లో ఒకే గ్రౌండ్లో నాలుగైదు మ్యాచ్లు ఆడటం సర్వసాధారణమే) జరుగుతున్నది. ఆ మ్యాచ్లో బ్యాటర్ కొట్టిన బంతి వేగంగా వచ్చి జయేశ్ సావ్లాకు చెవి పక్కన బలంగా తాకింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న వాళ్లు ఆస్పత్రికి తరలించినా అతడు అప్పటికే మరణించాడని వైద్యులు తేల్చారు. ఇందులో కుట్ర వంటిది ఏదీ లేదని, ప్రమాదవశాత్తూ సంభవించిందేనని పోలీసులు స్పష్టం చేశారు.
అంతర్జాతీయ క్రికెట్లో కూడా ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూగ్స్ కూడా ఇదే విధంగా మరణించిన విషయం క్రికెట్ అభిమానులకు తెలిసిందే. 2014లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా న్యూసౌత్వేల్స్ – సౌత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ హ్యూగ్స్ తలకు గాయమవడంతో అతడు చనిపోయాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లైన ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్లకు హ్యూగ్స్ మంచి మిత్రుడు.