రెండు వరుస పరాజయాల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ను చిత్తుచేసి గాడిలో పడింది. బ్యాటింగ్ పిచ్పై తొలుత రాయల్స్ను కట్టడి చేసిన రోహిత్సేన.. ఆ తర్వాత డికాక్ రెచ్చిపోవడంతో మోస్తరు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఢిల్లీ పిచ్పై 171 పరుగులు చేసి హైదరాబాద్ ఓడిన ఒక్కరోజు తర్వాత అన్నే రన్స్ చేసి రాయల్స్ సైతం చతికిలపడింది.
ఢిల్లీ: ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 14వ సీజన్లో గెలుపుబాట పట్టింది. గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో ముంబై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై గెలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ (27 బంతుల్లో 42; 5ఫోర్లు), జోస్ బట్లర్ (32 బంతుల్లో 41; 3ఫోర్లు, 3సిక్స్లు) రాణించారు. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా బ్యాటింగ్ పిచ్పై బుమ్రా (1/15) పొదుపుగా బౌలింగ్ చేశాడు. లక్ష్యఛేదనలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (50 బంతుల్లో 70 నాటౌట్; 6ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో అదరగొట్టడంతో ముంబై 18.3 ఓవర్లలోనే 3 వికెట్లకు 172 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో మోరిస్కు రెండు, ముస్తాఫిజుర్కు ఓ వికెట్ దక్కింది.
మొదట దూకుడు.. చివర్లో తడబాటు
తొలి బంతికే బౌండరీతో ఇన్నింగ్స్ ఆరంభించిన బట్లర్ దూకుడుగా ఆడగా.. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (32) కూడా రాణించడంతో పవర్ప్లే ముగిసే సరికి రాజస్థాన్ 47 పరుగులు చేసింది. ఆ తర్వాత బట్లర్, జైస్వాల్ను ముంబై స్పిన్నర్ రాహుల్ చాహర్ ఔట్ చేయడంతో రాజస్థాన్ పరుగుల వేగం తగ్గింది. కెప్టెన్ శాంసన్ వేగంగా ఆడినా శివమ్ దూబే (31 బంతుల్లో 35) నెమ్మదైన బ్యాటింగ్తో రాజస్థాన్ భారీ స్కోరు చేయలేకపోయింది. చివర్లో మిల్లర్ (7నాటౌట్), పరాగ్ (8నాటౌట్) కూడా మెరిపించలేకపోయారు. దీంతో చివరి పది ఓవర్లలో రాయల్స్ 80 పరుగులే చేయగలిగింది. బుమ్రా, బౌల్ట్ యార్కర్లతో రాజస్థాన్ను కట్టడి చేశారు.
దుమ్మురేపిన డికాక్
ఓపెనర్ క్వింటన్ డికాక్ చివరి వరకు నిలువడంతో మోస్తరు లక్ష్యాన్ని ముంబై ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఇబ్బందిగా కనిపించిన కెప్టెన్ రోహిత్ (14)ను, మూడు ఫోర్లతో మెరిపించిన సూర్యకుమార్ (16) ను పేసర్ మోరిస్ ఔట్ చేయడంతో ఓ దశలో రాయల్స్ ఆశలు చిగురించాయి. అయితే డికాక్ ఓ ఎండ్లో పాతుకుపోగా కృనాల్ (39) సైతం దూకుడుగా ఆడడంతో ముంబై స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో గేరు మార్చిన డికాక్ 35 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. 11వ ఓవర్లో రోహిత్సేన స్కోరు వంద దాటింది. కృనాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన పొలార్డ్ (16నాటౌట్) తన శైలిలో ఆడడంతో 9 బంతులు మిగిలి ఉండగానే ముంబై గెలిచింది.
స్కోరు బోర్డు:
రాజస్థాన్: బట్లర్ (స్టంప్) డికాక్ (బి) చాహర్ 41, యశస్వి (సి&బి) చాహర్ 32, శాంసన్ (బౌల్డ్) బౌల్ట్ 42, దూబే (సి&బి) బుమ్రా 35, మిల్లర్ (నాటౌట్) 7, పరాగ్ (నాటౌట్) 8; ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 171/4. వికెట్ల పతనం: 1-66, 2-91, 3-148, 4-158; బౌలింగ్: బౌల్ట్ 4-0-37-1, బుమ్రా 4-0-15-1, జయంత్ 3-0-37-0, కుల్టర్నైల్ 4-0-35-0, రాహుల్ చాహర్ 4-0-33-2, కృనాల్ 1-0-12-0.
ముంబై: రోహిత్ (సి) సకారియా (బి) మోరిస్ 14, డికాక్ (నాటౌట్) 70, సూర్యకుమార్ (సి) బట్లర్ (బి) మోరిస్ 16, కృనాల్ (బౌల్డ్) ముస్తాఫిజుర్ 39, పొలార్డ్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు: 17, మొత్తం; 18.3 ఓవర్లలో 172/3. వికెట్ల పతనం: 1-49, 2-83, 3-146; బౌలింగ్: సకారియా 3-0-18-0, ఉనాద్కత్ 4-0-33-0, ముస్తాఫిజుర్ 3.3-0-37-1, మోరిస్ 4-0-33-2, తెవాటియా 3-0-30-0, దూబే 1-0-6-0.