ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరొందిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతని సారధ్యంలో భారత జట్టు ఎన్నో మరపురాని విజయాలు అందుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ కూడా గెలుచుకుంది. ధోనీ ఏం చేసినా స్పెషల్గానే ఉంటుంది. ఇప్పుడు కూడా ధోనీ చేసిన ఒక పని నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తనకు రెండు మోకాళ్లలో నొప్పి వస్తోందంటూ ఒక నాటు వైద్యుడి దగ్గర చికిత్స తీసుకుంటున్నాడీ స్టార్ క్రికెటర్. రాంచీలో ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తుండే వందన్ సింగ్.. ఒక చెట్టు కింద కూర్చొని వైద్యం చేస్తుంటారు. ఆయన గురించి ధోనీ తల్లిదండ్రులకు ముందు నుంచి తెలుసట. వాళ్లు ఆయన దగ్గరకు వచ్చి వైద్యం తీసుకునే వారని సమాచారం. ఈ విషయం తెలిసిన ధోనీ కూడా తన మోకాళ్ల నొప్పికి ట్రీట్మెంట్ కోసం వందన్ వద్దకే వస్తున్నాడు.
పాలలో కొన్ని మూలికలు కలిపి తాగాలని వందన్ చెప్పినట్లు సమాచారం. నెలరోజుల క్రితం ధోనీకి తొలి డోస్ ఇవ్వగా.. మరుసటి డోస్ కోసం ఎప్పుడు వచ్చేదీ తనకు తెలియదని వందన్ వివరించారు. ధోనీ ఇంత పెద్ద స్టార్ అని తనకు తెలియదని, ఆ తర్వాత చాలా మంది చెప్పడంతోనే తెలిసిందని చెప్పారు.