Spirit Of Cricket – MS Dhoni : యాషెస్ సిరీస్(Ashes Series)లో తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన ఆస్ట్రేలియాపై మైదానం లోపలా, బయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు బెయిర్స్టో(Jonny Bairstow)ను ఔట్ చేసిన విధానం వివాదాస్పదం కావడమే అందుకు కారణం. దాంతో, మరోసారి కంగారూల క్రీడాస్ఫూర్తి(Spirit Of Cricket) చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhnoi) ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తిని గుర్తు చేస్తున్నారు.
పన్నెండేళ్ల క్రితం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య దాదాపు ఇలాంటి ఘటనే జరిగింది. కానీ, అప్పుడు టీమ్ఇండియా కెప్టెన్గా ఉన్న ధోనీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఔటై పెవిలియన్కు చేరిన ఇయాన్ బెల్(Ion Bell)ను మళ్లీ క్రీజులోకి ఆహ్వానించాడు. నాటింగ్హామ్ స్టేడియం ఈ సంఘటనకు వేదికైంది.
ఇషాంత్ శర్మ(Ishant Sharma) వేసిన బంతిని మోర్గాన్ లెగ్సైడ్ ఆడాడు. ప్రవీణ్ కుమార్ బౌండరీ లైన్ సమీపంలో డైవ్ చేసి బంతిని ఆపాడు. బంతిని ధోనీ వైపు విసిరాడు. బంతి అందుకున్న మహీ వికెట్లను పడగొట్టాడు. అయితే.. బాల్ బౌండరీ లైన్ దాటి ఉంటుందని అనుకున్న ఇయాన్ బెల్, మోర్గాన్ క్రీజు బయటే నిల్చున్నారు. బంతి బౌండరీని తాకిందా? లేదా? అని నిర్ధారించుకునేందుకు థర్డ్ అంపైర్ను సంప్రదించగా.. ఫోర్ కాదని చెప్పాడు. బెల్ను రనౌట్గా ప్రకటించాడు. ఈ సమయంలో ధోనీ రనౌట్ అప్పీల్ను వెనక్కి తీసుకుంటున్నామని అంప్లైర్లకు చెప్పాడు. దీంతో, టీ విరామం అనంతరం బెల్ను తిరిగి బ్యాటింగ్కు ఆహ్వానించి క్రీడాలోకానికి ఆదర్శంగా నిలిచాడు. అందకుగానూ ధోనీకి ఐసీసీ 2020లో అవార్డు ప్రదానం చేసింది.
ఇయాన్ బెల్, మహేంద్ర సింగ్ ధోనీ
యాషెస్ రెండో టెస్టు రనౌట్ వ్యవహారంలో బెయిర్స్టో తొందరపాటు కూడా ఉంది. చివరి రోజు ఇంగ్లండ్ 193/5తో మంచి స్థితిలో ఉంది. ఆ సమయంలో బెయిర్స్టో వికెట్ సమర్పించుకున్నాడు. గ్రీన్ వేసిన లో బౌన్సర్ను తప్పించుకునేందుకు కిందకు వంగిన అతను.. ఓవర్ పూర్తయిందనుకొని క్రీజు దాటాడు. కానీ, బంతిని అందుకున్నకీపర్ అలెక్స్ కారీ స్టంప్స్ పడగొట్టాడు. ఆసీస్ ఆటగాళ్లంతా అప్పీల్ చేయగా.. థర్డ్ అంపైర్ బెయిర్స్టోని ఔట్గా ప్రకటించాడు. ఈ అంశంపై లార్డ్స్లోని లాంజ్లోనూ తీవ్ర చర్చలు జరిగాయి. కంగారూ ఆటగాళ్లు అప్పీల్ వెనక్కి తీసుకొని ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఆసీస్ ఆటగాళ్లను చీటర్స్ అంటూ అభిమానులు తమ అక్కసు వెళ్లగక్కారు. తొలి రెండు టెస్టులు నెగ్గిన ఆసీస్ ఐదు టెస్టుల సిరీస్లో 2-0తో ఆధిక్యంలో ఉంది. కీలకమైన మూడో టెస్టు లీడ్స్లో జూలై 6న మొదలవ్వనుంది.