హైదరాబాద్: ధనాధన్ బ్యాటింగ్.. బాధ్యతాయుతమైన నాయకత్వంతో మిస్టర్ కూల్ కెప్టెన్గా విశిష్ఠ పేరు ప్రఖ్యాతులు గడించిన దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వెంచర్లోని ఎంఎస్డీసీఏ క్రికెట్ అకాడమీని హైదరాబాద్లో ప్రారంభిస్తుండడం గొప్ప విషయమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కొనియాడారు.
శుక్రవారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఎంఎస్డీసీఏ అకాడమీ ప్రారంభోత్సవంలో మల్లారెడ్డి, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంఎస్డీసీఏ-ఆర్కా ఎండీ మిహిర్ దివాకర్ పాల్గొన్నారు. తొలుత మంత్రి సమక్షంలో ఎంఎస్డీసీఏతో రెండేళ్ల కాలానికి కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం, పల్లవి విద్యాసంస్థల చైర్మన్ మల్కా కొమరయ్య, మిహిర్ దివాకర్ మార్చుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో ఎంఎస్డీసీఏ ఏర్పాటుకు చొరవ తీసుకున్న కొమరయ్యను ప్రత్యేకంగా అభినందించారు. ఎంఎస్డీసీఏను ఉన్నత ప్రమాణాలతో నడుపుతూ భవిష్యత్లో ధోనీ వంటి ఉత్తమ క్రికెటర్లను టీమిండియాకు అందించాలని మంత్రి ఆకాంక్షించారు.
క్రికెటర్ కావాలనే ఆశయమున్న పిల్లలు, యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన శిక్షణ అందించాలనే ఏకైక ఉద్దేశంతో ‘ఎంఎస్డీసీఏ’ను స్థాపించినట్టు ఆ సంస్థ ఎండీ మిహిర్ చెప్పారు. దేశంలో ప్రతిభ గల క్రికెటర్లకు ప్రణాళికబద్దమైన శిక్షణ అందించాలనేది తమ అభిమతమని అన్నారు.
ఇందులో భాగంగా ప్రస్తుతం పల్లవి, డీపీఎస్ విద్యాసంస్థలతో కలిసి హైదరాబాద్, దాని చుట్టు పక్కల పది అకాడమీలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. ‘తొలిదశలో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో ఈ నెలాఖరు నుంచి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. డీపీఎస్ నాదర్గుల్ అలానే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ గండిపేట, బోడుప్పల్ శాఖలలో వచ్చే నెలలో అకాడమీలు తెరవనున్నాం. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా అకాడమీలు తెరిచే ఆలోచనలు ఉన్నాయ’ని చెప్పారు.
‘అకాడమీ పనితీరు విషయానికొస్తే నిబద్ధత, విలువలతో కూడిన శిక్షణ, సమిష్ఠి కృషి, ఆటను ఆస్వాదించడం, కొత్త విషయాలను అన్వయించుకోవడమనే సూత్రాల ఆధారంగా ఎంఎస్డీసీఏ శిక్షణ ఉంటుంది. నిష్ణాతులైన కోచ్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని భావి, వర్ధమాన క్రికెటర్లకు చేరువ చేయాలనే మిషన్తో ఎంఎస్డీసీఏ పనిచేస్తోంది. ఎంఎస్డీసీఏ కోచింగ్ మాడ్యూల్ను ధోనీ సూచనలు మేరకు ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తుంటాం. ధోనీ అనుమతి తీసుకున్నాకే కోచింగ్ మాడ్యూల్ను అకాడమీల్లో ప్రవేశపెడతాం’ అని మిహిర్ వివరించారు.