Mohammed Shami | ప్రపంచకప్కు ముందు భారత క్రికెటర్ మహ్మద్ షమీకి ఊరట లభించింది. అతని భార్య పెట్టిన వేధింపుల కేసులో షమీ అలీపూర్ కోర్టుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన క్రికెటర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తును పరిశీలించి కోర్టు.. బెయిల్ మంజూరు చేసింది. షమీతో పాటు అతని సోదరుడు మహ్మద్ హసీమ్కు సైతం కోర్టు బెయిల్ ఇచ్చింది. షమీ తరఫు న్యాయవాది సలీం రెహ్మాన్ మాట్లాడుతూ ‘షమీ, హసీం కోర్టుకు హాజరయ్యారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు అనుమతి ఇచ్చింది’ అని తెలిపారు.
అయితే, మహ్మద్ షమితో పాటు అతడి సోదరుడిపై 2018లో జాదవ్పూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. ఇద్దరు తనను వేధిస్తున్నారంటూ షమి భార్య హసిన్ జహాన్ ఫిర్యాదు చేయగా.. ఆగస్టు 29, 2019లో అలీపూర్ ఏసీజేఎం కోర్టు షమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అదే ఏడాది సెప్టెంబర్ 9న అలీపూర్ జిల్లా సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్ను సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి కేసు పెండింగ్లో ఉంది. అయితే, నాలుగేళ్లుగా షమీపై పెండింగ్లో ఉన్న స్టేను ఎత్తివేయాలని హసిన్ జహాన్ ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. షమీ జాతీయ క్రికెట్ జట్టుతో పర్యటనలకు వెళ్లిన సమయంలో పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగించాడని.. ఇప్పటికీ ఇంకా సంబంధాలు కొనసాగిస్తున్నాడని విమర్శించింది.