Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్, వన్డే వరల్డ్ కప్లో అత్యద్బుతమైన బౌలింగ్ ప్రతిభతో భారత్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన మహ్మద్ షమీ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ విజయాలను జీర్ణించుకోలేక పదే పదే టీమిండియా విజయాలపై బురదజల్లుతున్నారని ఆరోపించాడు. గతేడాది వన్డే వరల్డ్కప్లో భాగంగా భారత్ వరుస విజయాల వెనుక ఐసీసీ హస్తం ఉన్నదని, ఐసీసీ వాళ్లకు ప్రత్యేక బంతులను కేటాయించిందని పాక్ మాజీ ఆటగాడు హసన్ రాజా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా షమీ హసన్ రాజా వ్యాఖ్యలపై స్పందించాడు.
ఓ జాతీయ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ ఇదే విషయమై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ… ‘వాళ్లు క్రికెట్ను ఓ జోక్ చేసేశారు. ఇతరుల విజయాన్ని వాళ్లు ఆస్వాదించలేరు. మిమ్మల్ని, మీ విజయాలను ఇతరులు పొగిడినప్పుడు సంతోషంగానే ఉంటుంది. కానీ మీరు ఓడినప్పుడు, మీరు మోసం చేసినట్టుగా భావిస్తారు. పాక్ మాజీల వాదన కూడా అలాగే ఉంటుంది. వాళ్లకు ద్వేషమెక్కువ. మనసులో ఇంత ద్వేషం పెట్టుకుంటే ఆటలో మంచి ఫలితాలు రావు’ అని షమీ అన్నాడు.
పాకిస్తాన్ జట్టును ప్రపంచకప్లలో టీమిండియా ఓడించిన రికార్డుపైనా షమీ స్పందించాడు. ‘అది (పాక్ను ఐసీసీ టోర్నీలలో ఓడించే అలవాటు) మా రక్తంలోనే ఉంది’ అని అన్నాడు. అంతేగాక ‘కొంతకాలంగా భారత్, పాక్ మ్యాచ్ల రికార్డులు చూడండి. ఆ జట్టు మన దరిదాపుల్లోకి కూడా రాదు..’ అని వ్యాఖ్యానించాడు. వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత షమీ మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో గాయం కారణంగా అతడు ఆడటం లేదు.