దుబాయ్: తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు సంబరాల్లో మునిగిపోయింది. న్యూజిల్యాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో కంగారూలు ఘనవిజయం సాధించి కప్పును ముద్దాడారు. ఈ జట్టు కప్పు గెలవడంలో కీలకపాత్ర ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్ర పోషించాడు. సిరీస్లో 289 పరుగులు చేశాడు.
ముఖ్యంగా ఫైనల్, సెమీఫైనల్ మ్యాచుల్లో ఆసీస్ గెలుపులో వార్నర్ పాత్ర మరువలేనిది. ఫైనల్లో 53 పరుగులు చేసి జట్టు ఛేజింగ్ను సులభతరం చేశాడీ ఓపెనర్. ఈ క్రమంలోనే మ్యాన్ ఆఫ్ ది ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ 2021 అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు ఆసీస్ క్రికెట్లో అతనే ట్రెండింగ్ టాపిక్.
ప్రపంచకప్ ముందు జరిగిన ఐపీఎల్లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో సన్రైజర్స్ జట్టు ఆడే 11 మందిలో చోటుకోల్పోయిన వార్నర్ను.. ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయడాన్ని చాలామంది తప్పుబట్టారు. వీరందరికీ వార్నర్ తన బ్యాటుతో సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
‘జీవితంలోగానీ, ఆటలోగానీ కూడా ఓటమి ఒప్పుకోకూడదు. డేవిడ్ వార్నర్ను చూడండి.. ఐపీఎల్ జట్టులో ఆడటానికి కూడా సరిపోని స్థాయి నుంచి టీ20 ప్రపంచకప్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. కొన్నిసార్లు సన్రైజ్ ఆలస్యం అవుతుందంతే’ అని ట్వీట్ చేశాడు.
ఐపీఎల్లో ఆడే 11 మంది నుంచి వార్నర్ను తప్పించిన సన్రైజర్స్ యాజమాన్యం, అతన్ని జట్టు శిబిరంలోకి కూడా రానివ్వలేదు. దీంతో అతను ప్రేక్షకుల సీట్లో కూర్చొని తన జట్టుకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.