Mitchell Johnson : భారత్, ఆస్ట్రేలియా మధ్య త్వరలో ప్రారంభం కానున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీపై అందరి కళ్లు నిలిచాయి. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా స్పిన్నర్లను ఎదర్కోవడం భారత్కు కష్టమని మాజీలు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఆటగాళ్లు ఆసీస్ స్పిన్నర్లకు భయపడరని అతను అన్నాడు.
‘ఇండియన్ బ్యాటర్లు అనుభవజ్ఞుడైన నాథన్ లియాన్ను గౌరవిస్తారు. అంతేకానీ అతడికి భయపడరు. అగర్తో పాటు మిగతా స్పిన్నర్లకు కూడా జంకరు. భారత క్రికెటర్లు క్రీజులో తమ పాదాల కదలికను చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారు. స్పిన్నర్ల బౌలింగ్లో కచ్చితత్వంతో షాట్లు ఆడతారు’ అని అతను తెలిపాడు. అయితే.. ఫ్లాట్ పిచ్లపై, గడ్డి లేని పిచ్లపై ఆస్ట్రేలియా స్పిన్నర్లు భారత ఆటగాళ్లను ఇబ్బంది పెడతారని జాన్సన్ తెలిపాడు. ఈ స్పీడ్స్టర్ 2018 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.
భారత్, ఆసీస్ జట్లు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టులు ఆడనున్నాయి. మొదటి టెస్టు నాగ్పూర్లో ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. ఆసీస్ పేసర్లు, భారత బ్యాటర్ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనుంది. భారత పిచ్లపై ఆసీస్ బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది వేచి చూడాలి.