India Tour Of South Africa: ప్రపంచ క్రికెట్ను కనుసైగతో శాసిస్తున్నా.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్
వంటి దేశాల మీద అక్కడ అప్రతిహాత విజయాలతో సాగుతున్నా భారత క్రికెట్ జట్టు ఇంతవరకూ దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ నెగ్గలేదు. 1992-93 నుంచి భారత్.. సౌతాఫ్రికా టూర్స్కు వెళ్తున్నా ఇప్పటివరకూ ఒక్క సిరీస్ కూడా సొంతం చేసుకోకపోవడం తీరని లోటు. మూడు దశాబ్దాలకు పైగా సఫారీ గడ్డమీద సిరీస్ గెలుపు కోసం పోరాడుతున్న టీమిండియా.. త్వరలో జరుగబోయే టెస్టు సిరీస్లో అయినా దానిని సాధించి చరిత్ర సృష్టించాలని ఆశిస్తున్నది. ఈ మేరకు భారత జట్టు నేటి రాత్రే ఆఫ్రికా ఖండానికి పయనం కానున్నది. తొలుత టీ20 జట్టు వెళ్లనుండగా అనంతరం వన్డే, టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్ల సౌతాఫ్రికా వెళ్లనున్నారు.
మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడేందుకు గాను యువ భారత్ మంగళవారం రాత్రి ముంబై నుంచి కేప్టౌన్ విమానం ఎక్కనుంది. డిసెంబర్ పది నుంచి భారత్.. సఫారీ టీమ్తో తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నది. ఆ తర్వాత డిసెంబర్ 17 నుంచి వన్డే సిరీస్ మొదలుకావాల్సి ఉండగా డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు జరగాల్సి ఉంది. గత మూడు దశాబ్దాలలో ఎనిమిది సార్లు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత ప్రదర్శన ఎలా ఉంది..?
8 సిరీస్లు.. దక్షిణాఫ్రికా 8-0
1. భారత్ తొలిసారి 1992-93 సీజన్లో సౌతాఫ్రికా టూర్కు టెస్టులు ఆడేందుకు వెళ్లింది. ఈ టూర్లో భారత్ నాలుగు టెస్టులు ఆడింది. తొలి మ్యాచ్ డ్రాగా ముగియగా రెండో మ్యాచ్ కూడా డ్రా అయింది. పోర్ట్ ఎలిజిబెత్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో ప్రొటీస్ టీమ్ 9 వికెట్ల తేడాతో గెలవగా నాలుగో మ్యాచ్ కూడా డ్రా గానే ముగిసింది. ఈ సిరీస్లో భారత్కు మహ్మద్ అజారుద్దీన్ సారథిగా వ్యవహరించాడు.
2. 1996-97లో భారత్ రెండోసారి సఫారీ టూర్కు వెళ్లింది. ఈసారి భారత్ను నడిపించింది సచిన్ టెండూల్కర్. రెండు మ్యాచ్ల ఈ సిరీస్ను దక్షిణాఫ్రికా 2-0తో గెలుచుకుంది. తొలి మ్యాచ్లో 328, రెండో మ్యాచ్లో 282 పరుగులతో ఓడింది.
౩. ఈ శతాబ్దపు తొలినాళ్ల (2001-02)లో భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ సారథ్యంలో దక్షిణాఫ్రికా వెళ్లిన టీమిండియా.. 0-1తో ఓడింది.
4. 2006-07లో ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో సఫారీ టూర్కు వెళ్లిన భారత్.. ఈ టూర్లో తొలిసారిగా దక్షిణాఫ్రికా గడ్డపై విజయాన్ని నమోదుచేసింది. జోహన్నస్బర్గ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 123 పరుగులతో గెలిచింది. కానీ మూడు మ్యాచ్ల సిరీస్ను 1-2తో కోల్పోయింది.
5. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు 2010-11లో దక్షిణాఫ్రికా టూర్కు వెళ్లగా ఆడిన మూడు మ్యాచ్లలో ఒకటి గెలిచి ఒకదాంట్లో ఓడగా ఒకటి డ్రా అయింది. ఈ సిరీస్ 1-1 తో డ్రా అయింది.
6. 2013-14 లలో కూడా భారత్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో సఫారీ టూర్కు వెళ్లింది. ఈ పర్యటనలో రెండు మ్యాచ్లు ఆడిన భారత్ ఒక్కటి కూడా గెలవలేదు. తొలి టెస్టు దక్షిణాఫ్రికా నెగ్గగా రెండో మ్యాచ్ డ్రా అయింది.
7. 2015 నుంచి ఈ సిరీస్ను మహాత్మా గాంధీ – నెల్సన్ మండేలా జ్ఞాపకార్థం ఫ్రీడమ్ సిరీస్ గా నామకరణం చేశారు. 2017 – 18లో భారత్.. సౌతాఫ్రికా టూర్లో మూడు మ్యాచ్లు ఆడేందుకు వెళ్లగా ఈసారి కూడా ఓటమి తప్పలేదు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు.. 1-2 తేడాతో సిరీస్ కోల్పోయింది.
8. 2021-22లో కూడా భారత్ కోహ్లీ సారథ్యంలోనే దక్షిణాఫ్రికా టూర్కు వెళ్లింది. కోహ్లీకి టెస్టు కెప్టెన్గా ఇదే లాస్ట్ సిరీస్. ఈ టూర్లో మూడు మ్యాచ్లు ఆడిన భారత్.. ఒక్క టెస్టు మాత్రమే నెగ్గి రెండింటిలో ఓడింది. మరి ఈసారి రెండు టెస్టులు ఆడనున్న భారత్.. దక్షిణాఫ్రికా గడ్డ మీద జెండా పాతుతుందా..? అన్నది ఆసక్తికరం.