Micky Arthur : ప్రపంచంలోని క్రికెట్ జట్లలో పాకిస్థాన్(Pakistan) అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ అని తెలిసిందే. ఆ టీమ్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ ఊహించలేరు. గతంలో మెగా టోర్నీల్లో సంచలన విజయాలతో వార్తల్లో నిలిచిన పాక్ ఈ మధ్య వరుస వైఫల్యాలతో డీలా పడింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ టీమ్ డైరెక్టర్ మికీ అర్థర్(Micky Arthur) సంచలన ఆరోపణలు చేశాడు. పాక్ ఆటగాళ్లకు జట్టు కంటే సొంత ప్రయోజనాలే ముఖ్యమని బాంబ్ పేల్చాడు. పాక్ జట్టులో సమిష్టితత్వం లేదని, క్రికెటర్లంతా కేవలం కాంట్రాక్ట్ కోసమే ఆడుతారని ఆర్థర్ వెల్లడించాడు.
‘ఆటగాళ్లకు భద్రత ఉంటే పాకిస్థాన్ అద్భుతంగా ఆడుతుంది. ఒకవేళ అభద్రతా ఉందనుకోండి.. అప్పుడు అందరూ జట్టు కోసం కాకుండా తమ స్థానాన్ని కాపాడుకోవడానికే ఆడుతారు. ఎందుకంటే..? వాళ్ల దృష్టంతా తర్వాతి సిరీస్, కాంట్రాక్ట్ మీదనే ఉంటుంది. క్రికెటర్లు అలా ఆలోచించడం చాలా ప్రమాదకరం. ఇప్పుడు పాక్ క్రికెట్ ఆ పరిస్థితుల్లో ఉండడం నన్ను ఎంతో బాధించింది’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో ఆర్థర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు పాక్ జట్టులో ప్రతిభకు కొదువలేదని, ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారని అన్నాడు.