తాష్కెంట్ : ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు దీపక్ బోరియా(51కి.), నిశాంత్ దేవ్(71కి.) ప్రత్యర్థులను చిత్తుచేసి క్వార్టర్ఫైనల్లో ప్రవేశించారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న దీపక్ ఏకపక్షంగా సాగిన ప్రికార్టర్స్లో జియామొను(చైనా)5-0తో చిత్తుగా ఓడించాడు. దీపక్ మరోసారి తన సత్తా చాటుతూ తిరుగులేని విజయం అందుకున్నాడు. తొలి రౌండ్లో ఇరువురూ సమఉజ్జీలుగా పోరాడినా, తరువాతి ఆరు నిమిషాలలో దీపక్దే పైచేయిగా సాగింది.
ప్రత్యర్థి పంచ్లను కాసుకుంటూ అదనుచూసి ముష్ఠిఘాతాలతో పాయింట్లను రాబట్టాడు. ఎట్టకేలకు దీపక్ ఏకగ్రీవంగా 5-0తో విజేతగా నిలిచాడు. మరో పోరులో నిశాంత్ చెమటోడ్చకుండా ప్రత్యర్థిని మట్టికరిపించాడు. ఫఖాహ నిదాల్(పాలస్తీనా)పై నిశాంత్ రెఫరీ స్టాప్స్ ది కంటెస్ట్ ద్వారా విజేతగా నిలిచాడు. నిశాంత్ పిడిగుద్దులకు పాలస్తీనా బాక్సర్ సొమ్మసిల్లడంతో రెఫరీ పోటీని నిలిపివేసి నిశాంత్ను విజేతగా ప్రకటించాడు.