Ram Charan | హైదరాబాద్, ఆట ప్రతినిధి: సినీ నటుడు రామ్చరణ్ క్రీడా రంగంలో అడుగుపెట్టాడు. ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్)లో హైదరాబాద్ జట్టును కొనుగోలు చేశాడు. ‘ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్లో హైదరాబాద్ టీమ్కు యజమానిగా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సమాజంలో స్ఫూర్తినింపేందుకు.. గల్లీ క్రికెట్ సంబురాలు జరుపుకునేందుకు ఈ వెంచర్ను ప్రారంభించా’ అని రామ్చరణ్ ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు.
ఈ టీమ్లో భాగం కావాలనుకున్న క్రీడాకారుల కోసం ఓ లింక్ను షేర్ చేసిన రామ్చరణ్.. ఆసక్తి ఉన్న వాళ్లు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ప్రముఖ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్లో పలు జట్లను కొనుగోలు చేశారు. వచ్చే ఏడాది మర్చి 2 నుంచి ముంబై వేదికగా ఈ లీగ్ జరగనుంది.