లండన్: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ – 2023 ఫైనల్ మ్యాచ్కు అంపైర్లుగా, రిఫరీగా వ్యవహరించే అధికారుల పేర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఒక ప్రకటన చేసింది. WTC-2023 ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనుంది. యూకే రాజధాని లండన్లోని ఓవల్ క్రికెట్ స్టేడియంలో జూన్ 7న ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. జూన్ 7 నుంచి 11 వరకు ఐదు రోజులపాటు ఈ ఫైనల్ టెస్టు మ్యాచ్ జరుగనుంది.
ఈ మ్యాచ్కు ఫీల్డ్ అంపైర్లుగా న్యూజిలాండ్కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్కు చెందిన రిచర్డ్ ఇల్లింగవర్త్ వ్యవహరించనున్నారు. ఇక ఇంగ్లండ్కే చెందిన మరో అంపైర్ రిచర్డ్ కెటిల్బరో ఈ మ్యాచ్కు టీవీ అంపైర్గా, శ్రీలంకకు చెందిన కుమార్ ధర్మసేన ఫోర్త్ అంపైర్గా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. అదేవిధంగా వెస్టిండీస్కు చెందిన రికీ రిచర్డ్సన్ ఈ WTC ఫైనల్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించనున్నారు.
కాగా, ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించబోతున్న గఫానీ, ఇల్లింగవర్త్లకు అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్లుగా అపారమైన అనుభవం ఉంది. వీళ్లిద్దరూ ఎమిరేట్స్ ఐసీసీ ప్యానెల్ ఆఫ్ అంపైర్స్లో సభ్యులుగా కూడా కొనసాగుతున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ గఫానీకి 49వ టెస్టు కాగా, ఇల్లింగ్వర్త్కు 64వ టెస్టు. ఇక టీవీ అంపైర్గా వ్యవహరించబోయే కెటిల్బరోకు ఇది వరుసగా రెండో WTC ఫైనల్ మ్యాచ్. 2021లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సౌతాంప్టన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్కు కూడా కెటిల్ బరో టీవీ అంపైర్గా వ్యవహరించారు.