న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో భారత బృందానికి దిగ్గజ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ నేతృత్వం వహించనున్నారు. గతంలో ఒక దేశం నుంచి ఒకరే పతాకధారిగా ఉండగా.. ఈ సారి లింగ సమానాత్వాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వక్రీడల నిర్వాహకులు ఇద్దరికి అవకాశం కల్పించారు. ఇక ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా భారత పతాకధారిగా వ్యవహరించనున్నాడు. ఈ అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని మేరీ పేర్కొంది. ‘నేను పాల్గొంటున్న చివరి ఒలింపిక్స్లో ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. భారత బృందానికి నాయకత్వం వహిస్తూ ముందు నడవడం అనేది చాలా గొప్పవిషయం. అలాంటి చాన్స్ దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఇది నాకు ప్రేరణగా నిలుస్తుంది. టోక్యో ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తా’ అని మేరీ చెప్పింది. అభినవ్ బింద్రా.. రియో (2016)లో పతాకధారిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.