టోక్యో: ఒలింపిక్స్ తొలి రెండు ఈవెంట్లలో తీవ్రంగా నిరాశపరిచిన షూటర్ మను బాకర్ మొత్తానికి ఫామ్లోకి వచ్చింది. గురువారం ఉదయం జరిగిన 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్ ప్రిసిషన్ రౌండ్లో ఆమె ఐదో స్థానంలో నిలిచింది. ఇంతకుముందు ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో ఆమె విఫలమైన విషయం తెలిసిందే. అయితే 44 మంది పాల్గొన్న ఈ ప్రిసిషన్ రౌండ్లో మాత్రం మను.. మంచి ప్రదర్శన చేసింది. 292 స్కోరు సాధించిన ఆమె.. మూడు సిరీస్లలో కలిపి 9 ఇన్నర్ 10లు స్కోర్ చేయడం విశేషం.
తొలి సిరీస్లో 97, రెండో సిరీస్లో 97, మూడో సిరీస్లో 98 స్కోరు చేసింది. మరోవైపు ఇదే ఈవెంట్లో పాల్గొన్న వరల్డ్ నంబర్.2 ఇండియన్ షూటర్ రాహి సర్నోబత్ మాత్రం 25వ స్థానంతో సరిపెట్టుకుంది. మూడు సిరీస్లలో మొత్తం 12 ఇన్నర్ 10లు సాధించినా.. మొత్తం స్కోరు 287కే పరిమితమైంది. శుక్రవారం ఉదయం ఇదే ఈవెంట్లో రాపిడ్ రౌండ్ ఉంటుంది. ఈ ఇద్దరూ మరోసారి ఇందులో పాల్గొననున్నారు. ఈ ప్రిసిషన్, ర్యాపిడ్ రౌండ్లలో టాప్ 8 ఫైనల్కు వెళ్తారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఈవెంట్ జరుగుతుంది.