న్యూఢిల్లీ : ఆదివారం జరిగిన న్యూఢిల్లీ మారథాన్లో మాన్సింగ్, జ్యోతి గవాతె పురుషుల, మహిళల టైటిల్స్ గెలుచుకున్నారు. మాన్సింగ్ తన కెరీర్ అత్యుత్తమ టైమింగ్ నమోదు చేయగా, గత యేడాది విజేతగా నిలిచిన జ్యోతి తిరిగి టైటిల్ నిలబెట్టుకుంది. 33 ఏళ్ల మాన్ సింగ్ 2గం.14ని.13 సెకండ్లలో గమ్యాన్ని చేరుకుని తన గత ఉత్తమ టైమింగ్ (2గం.16ని.58సె.)ను రెండున్నర నిమిషాలు మెరుగుపరచుకున్నాడు.
ఈ విజయంతో మాన్ సింగ్ లక్షన్నర నగదు బహుమతిని అందుకున్నాడు. బెలియప్ప రజతం, కార్తీక్ కుమార్ కాంస్యం గెలుచుకున్నారు. అంతేగాక ఈ ముగ్గురు ఆసియన్ గేమ్స్ అర్హత ప్రమాణాన్ని అందుకున్నారు. మహిళల విభాగంలో జ్యోతి 2గం. 53ని.04సె.లో గమ్యం చేరి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఆమె ఆసియా గేమ్స్ అర్హత ప్రమాణాన్ని (2గం.37ని.) అందుకోలేకపోయింది. అశ్విని జాదవ్, జిగ్మెత్ డోల్మ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.