ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చోట కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ఢిల్లీ హిట్టర్లను కట్టడి చేసిన లక్నో.. డికాక్ మెరుపులతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది! ఫలితంగా వరుసగా మూడో మ్యాచ్ నెగ్గిన లక్నో.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది!
ముంబై: బాధ్యతాయుతమైన బౌలింగ్కు.. క్రమశిక్షణాయుత బ్యాటింగ్ తోడవడంతో ఐపీఎల్ 15వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ హ్యాట్రిక్ నమోదు చేసుకుంది. గురువారం జరిగిన పోరులో లక్నో 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. యువ ఓపెనర్ పృథ్వీ షా (34 బంతుల్లో 61; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో చెలరేగితే.. కెప్టెన్ రిషబ్ పంత్ (39 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (36 నాటౌట్) ఆఖరి వరకు క్రీజులో నిలిచినా అవసరమైనంత వేగంగా ఆడలేకపోయారు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు.. కృష్ణప్ప గౌతమ్ ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (52 బంతుల్లో 80; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొడితే.. ఆఖర్లో ఆయుశ్ బదోనీ (3 బంతుల్లో 10 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. డికాక్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా శుక్రవారం పంజాబ్తో గుజరాత్ తలపడనుంది.
పృథ్వీ షా ‘షో’
యువ ఓపెనర్ పృథ్వీ షా చాన్నాళ్ల తర్వాత సూపర్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీకి పృథ్వీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. మరో ఎండ్లో విధ్వంసక వీరుడు డేవిడ్ వార్నర్ను ప్రేక్షకపాత్రకు పరిచయం చేస్తూ.. పృథ్వీ మైదానం నలువైపులా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కృష్ణప్ప గౌతమ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లతో బాదుడు ప్రారంభించిన పృథ్వీ.. తదుపరి ఓవర్లో హోల్డర్కు 4,6 రుచి చూపించాడు. అవేశ్ ఖాన్కు హ్యాట్రిక్ ఫోర్లతో స్వాగతం పలికిన షా.. 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఏడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఇందులో వార్నర్ భాగస్వామ్యం కేవలం నాలుగు పరుగులే అంటే.. పృధ్వీ దూకుడు ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ జోరు చూస్తుంటే ఢిల్లీ భారీ స్కోరు చేయడం ఖాయమనిపించింది. అయితే గౌతమ్ ఓవర్లో 6,4తో ఫుల్ జోష్లో కనిపించిన షా.. కీపర్ డికాక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరడంతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. క్రీజులో తీవ్రంగా ఇబ్బంది పడ్డ వార్నర్ 12 బంతుల్లో 4 పరుగులే చేసి పెవిలియన్ చేరిపోగా.. రావ్మెన్ పావెల్ (3) అతడిని అనుసరించాడు. ఇక అక్కడి నుంచి రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఆట మొదలైంది. దాదాపు పది ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ జోడీ.. వేగంగా ఆడలేకపోయింది. లక్నో స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో భారీ షాట్లు ఆడేందుకు పంత్, సర్ఫరాజ్ ఇబ్బంది పడ్డాడు. లై వేసిన 16వ ఓవర్లో పంత్ 4,6,6 కొడితే.. అవేశ్ ఓవర్లో సర్ఫరాజ్ రెండు ఫోర్లు అరుసుకున్నాడు. ఆఖర్లో అయినా ఇన్నింగ్స్ వేగం పెరుగుతుందేమో అనుకుంటే.. అదీ సాధ్యపడలేదు. ఇన్నింగ్స్ ముగిసేవరకు క్రీజులో నిలిచిన పంత్, సర్ఫరాజ్ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయారు. చివరి మూడు ఓవర్లలో ఢిల్లీ ఒక్క ఫోర్ మాత్రమే నమోదు చేయగలిగింది.
స్కోరు బోర్డు
ఢిల్లీ: పృథ్వీ షా (సి) డికాక్ (బి) గౌతమ్ 61, వార్నర్ (సి) ఆయుశ్ (బి) బిష్ణోయ్ 4, పావెల్ (బి) బిష్ణోయ్ 3, పంత్ (నాటౌట్) 39, సర్ఫరాజ్ (నాటౌట్) 36, ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 20 ఓవర్లలో 149/3. వికెట్ల పతనం: 1-67, 2-69, 3-74, బౌలింగ్: హోల్డర్ 4-0-30-0, కృష్ణప్ప గౌతమ్ 4-1-23-1, అవేశ్ 3-0-32-0, రవి బిష్ణోయ్ 4-0-22-2, టై 3-0-28-0, కృనాల్ 2-0-12-0.
లక్నో: రాహుల్ (సి) పృథ్వీ షా (బి) కుల్దీప్ 24, డికాక్ (సి) సర్ఫరాజ్ (బి) కుల్దీప్ 80, లూయిస్ (సి) కుల్దీప్ (బి) లలిత్ 5, దీపక్ హుడా (సి) అక్షర్ (బి) శార్దూల్ 11, కృనాల్ (నాటౌట్) 19, ఆయుశ్ (నాటౌట్) 10, ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 19.4 ఓవర్లలో 155/4. వికెట్ల పతనం: 1-73, 2-86, 3-122, 4-145, బౌలింగ్: ముస్తఫిజుర్ 4-0-26-0, లలిత్ 4-0-21-1, శార్దూల్ 3.4-0-29-1, నోర్జే 2.2-0-35-0, అక్షర్ 2-0-11-0, కుల్దీప్ 3.4-0-31-2.