ఐపీఎల్లో ప్లేఆఫ్ రేసు రంజుగా సాగుతున్నది. లీగ్ ఆఖరి దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రతీ మ్యాచ్ అభిమానులకు పసందైన విందు అందిస్తున్నది. గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలువాలనుకున్న పంజాబ్ కింగ్స్ ఆశలపై ఢిల్లీ క్యాపిటల్స్ నీళ్లు గుమ్మరించింది. హిమాలయ పర్వత సానువుల్లో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కడదాకా పోరాడినా ఫలితం లేకపోయింది. భారీ లక్ష్యఛేదనలో లివింగ్స్టోన్ ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఈ ఓటమితో మరో మ్యాచ్ మిగిలుండగానే పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ధర్మశాల: పంజాబ్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. సొంతగడ్డపై తమకు ఎదురైన పరాజయానికి ఢిల్లీ దీటుగా బదులిచ్చింది. మిగిలిన రెండు మ్యాచ్లు గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలుద్దామనుకున్న పంజాబ్ ఆశలను ఢిల్లీ తుంచి వేసింది. బుధవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ 15 పరుగుల తేడాతో ఢిల్లీ చేతిలో పోరాడి ఓడింది. దీంతో ఆడిన 13 మ్యాచ్ల్లో ఆరు విజయాలతో పంజాబ్ (12) ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంటే ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించిన ఢిల్లీ(10) వెళుతూ వెళుతూ పంజాబ్ను తమ వెంట తీసుకెళ్లింది. తమ ఆఖరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో పంజాబ్ మ్యాచ్ ఆడనుండగా, చెన్నైతో ఢిల్లీ తలపడనుంది. మ్యాచ్ విషయానికొస్తే ఢిల్లీ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 198/8 స్కోరుకు పరిమితమైంది. లియామ్ లివింగ్స్టోన్(48 బంతుల్లో 94, 5ఫోర్లు, 9 సిక్స్లు), అతర్వ తదే(55 రిటైర్డ్ హర్ట్) అర్ధసెంచరీలతో రాణించారు.
ఇషాంత్శర్మ(2/36), నోకియా(2/36)రెండేసి వికెట్లు తీశారు. భారీ లక్ష్యఛేదనలో పంజాబ్కు సరైన శుభారంభం దక్కలేదు. కెప్టెన్ శిఖర్ ధవన్(0) డకౌట్గా వెనుదిరిగాడు. దీనికి తోడు జితేశ్శర్మ(0), షారుఖ్ఖాన్(6), కరన్(11) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఓవైపు సహచరులు విఫలమైనా..లివింగ్స్టోన్ ఒంటరి పోరాటంతో జట్టును ముందుకు నడిపించాడు. ఢిల్లీ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ ధర్మశాల స్టేడియాన్ని దడదడలాడించాడు. ఒకానొక దశలో లివింగ్స్టోన్ విజృంభణతో పంజాబ్ గెలుస్తుందనుకున్నా..ఢిల్లీనే అదృష్టం వరించింది. మరో ఎండ్లో సరైన సహకారం లేకపోవడంతో పంజాబ్కు ఓటమి ఖరారైంది. అంతకుముందు రిలీ రొసో(37 బంతుల్లో 82 నాటౌట్, 6 ఫోర్లు, 6 సిక్స్లు), పృథ్వీషా (38 బంతుల్లో 54) అర్ధసెంచరీలతో కదంతొక్కారు. ఫామ్లేమితో సతమతమైన షా ఈ మ్యాచ్లో ఆకట్టుకోగా, రొసో సాధికారిక ఇన్నింగ్స్తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. కరన్ (2/36)కు రెండు వికెట్లు దక్కాయి. రొసోకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఉప్పల్ స్టేడియం వేదికగా గురువారం హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఢిల్లీ: 20 ఓవర్లలో 213/2 (రొసో 82 నాటౌట్, పృథ్విషా 54, కరన్ 2/36), పంజాబ్: 20 ఓవర్లలో 198/8 (లివింగ్స్టోన్ 94, అథర్వ 55, ఇషాంత్శర్మ 2/36, నోకియా 2/36)