బ్యూనస్ ఎయిర్స్: సాకర్ మాంత్రికుడు, ఫుట్బాల్లో రెండు దశాబ్దాలుగా తనదైన ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ అంతర్జాతీయ ఆట ముగిసింది. రిటైర్మెంట్ ఊహాగానాల వేళ సోమవారం అతడు జాతీయ జట్టుకు వీడ్కోలు పలికాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచకప్లు ఆడిన మెస్సీ.. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల ఫిఫా వరల్డ్కప్లో తన జట్టును ఫైనల్ చేర్చిన మెస్సీ.. టైటిల్ పోరు ముగిశాకే (జూలై 21న) తన నిర్ణయాన్ని ప్రకటిద్దామని అనుకున్నా సరైన సందర్భం కోసం ఇన్నాళ్లూ వేచి చూశానని పోస్ట్లో పేర్కొన్నాడు. ‘ఫైనల్ ముగిశాక చాలా రోజులు ఆలోచించాక ఇన్ని రోజులకు నేను జాతీయ జట్టుకు వీడ్కోలు చెబుతున్నాననే నిర్ణయాన్ని మీతో పంచుకుంటున్నా.
ఈ నిర్ణయం నా మనసును వేధిస్తున్నా ఇదే అసలైన సమయమని భావిస్తున్నా. మేము జట్టుగా విజయాలు సాధించిన కొన్నాళ్ల కంటే ముందే నేను ఈ టీమ్ కోసం నా శక్తినంతా ధారపోశాను. మిమ్మల్ని అలరిస్తూ, ఈ జెర్సీ (అర్జెంటీనా)ని గర్వంగా నిలుపడం కోసం నేను చేయగల్గినంతా చేశాను’ అని అభిమానులకు భావోద్వేగ లేఖ రాశాడు. 20 ఏండ్లుగా తనకు సహకరించిన కోచ్లకు, జట్టు సహచరులకు, కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపిన మెస్సీ..ఇక నుంచి ఓ ప్రేక్షకుడిగా అర్జెంటీనా జట్టును బయటనుంచి మద్దతు తెలుపుతానని లేఖలో పేర్కొన్నాడు.
అర్జెంటీనా కోసం సర్వస్వాన్ని ధారపోసిన తనలో ఇంకా జట్టుకు ఇవ్వడానికేమీ మిగిలిలేదని, అదే తనను తీవ్రంగా బాధిస్తుందని లేఖలో రాసుకొచ్చాడు. అర్జెంటీనా వాసుడిగా గర్విస్తున్నానని, అదే గర్వంతో జట్టును వీడుతున్నానని చెబుతూ మెస్సీ లేఖను ముగించాడు. అయితే అంతర్జాతీయ స్థాయిలో రిటైర్మెంట్ ప్రకటించినా క్లబ్లకు మెస్సీ ఆడనున్నాడు.
వాస్తవానికి ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓడిన తర్వాతే మెస్సీ ఈ ప్రకటన చేస్తాడని ఊహాగానాలు వచ్చాయి. దానికి ఊతమిచ్చేలా అతడు ప్రపంచకప్లో ఇదే తనకు చివరి మ్యాచ్ అని అర్థం వచ్చేలా ఇన్స్టాలో పోస్ట్ పెట్టడంతో అప్పుడే ఆటకు రిటైర్మెంట్ చెబుతాడని వార్తలొచ్చాయి. కానీ అప్పుడేమీ స్పందించని మెస్సీ.. గత నెల 8న తాను ఎంతగానో ప్రేమించే తండ్రి (జార్జ్ మెస్సీ) మరణంతో కుంగిపోయాడు. తండ్రి మరణించాక మూడు వారాలకు మెస్సీ ఈ నిర్ణయాన్ని వెల్లడించడం గమనార్హం.