న్యూఢిల్లీ: భారత హాకీకి వన్నెలద్దిన దిగ్గజ క్రీడాకారుడు చరణ్జిత్ సింగ్ (90) కన్నుమూశారు. హిమాచల్ప్రదేశ్ ఉనాలోని స్వగృహంలో గురువారం తుదిశ్వాస విడిచారు. 1964 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన భారత జట్టుకు చరణ్జిత్ సింగ్ సారథ్యం వహించారు. అంతకుముందు 1960 రోమ్ ఒలింపిక్స్లో రజతం సాధించిన భారత జట్టులో చరణ్జిత్ మిడ్ఫీల్డర్గా సేవలందించారు. కెరీర్కు వీడ్కోలు పలికాక హిమాచల్ప్రదేశ్ విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా వ్యవహరించిన చరణ్జిత్ సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చరణ్జిత్ మృతికి హాకీ ఇండియా (హెచ్ఐ)తో పాటు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సంతాపం ప్రకటించారు.