IPL | న్యూఢిల్లీ: ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ ఫుల్స్టాప్ పెట్టాడు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారత్ బయట యూఏఈలో ఐపీఎల్ జరిగే అవకాశముందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అరుణ్ స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశాడు. శనివారం లోక్సభ ఎన్నికల తేదీలు విడుదలైన క్రమంలో ఆయన స్పందించాడు.
ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ను భారత్ బయటకు మార్చే ఉద్దేశం లేదని శనివారం ఆయన స్పష్టం చేశాడు. త్వరలోనే మిగిలిన షెడ్యూల్ను విడుదల చేస్తామని అన్నాడు. ఇప్పటికే రెండు వారాలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించిన ఐపీఎల్ పాలకవర్గం..పూర్తి స్థాయి మ్యాచ్ల తేదీలు, వేదికలను ప్రకటిస్తుందని వివరించాడు.