బంగ్లాదేశ్ 277/5
శ్రీలంకతో రెండో టెస్టు
ఢాకా: మిడిలార్డర్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీమ్ (115 బ్యాటింగ్; 13 ఫోర్లు), లిటన్ దాస్ (135 బ్యాటింగ్; 16 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీలతో కదం తొక్కడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. ఒక దశలో 24 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాను.. వీరిద్దరు ఆదుకోవడంతో తొలి రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ముష్ఫికర్, లిటన్ ఆరో వికెట్కు అజేయంగా 253 పరుగులు జోడించారు. బంగ్లా తరఫున ఆరో వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కాగా.. 25 పరుగుల లోపు ఐదు వికెట్లు కోల్పోయిన ప్రపంచంలోని ఏ జైట్టెనా ఆరో వికెట్కు చేసిన అత్యధిక పరుగులు కూడా ఇవే. మహ్ముదుల్ హసన్ (0), తమీమ్ ఇక్బాల్ (0), నజ్ముల్ హుసేన్ (8), మోమినుల్ హక్ (9), షకీబ్ అల్ హసన్ (0) విఫలమయ్యారు. లంక బౌలర్లలో కసున్ రజిత 3, అసిత ఫెర్నాండో రెండు వికెట్లు పడగొట్టారు.
మెండిస్కు ఛాతీ నొప్పి..
తొలి రోజు ఆటలో లంక వికెట్ కీపర్ కుషాల్ మెండిస్ అస్వస్థతకు లోనయ్యాడు. లంచ్ విరామానికి ఒక్క ఓవర్ ముందు ఛాతి నొప్పి లేవడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో సహాయ సిబ్బంది అతడిని పరీక్షించి.. దవాఖానాకు తరలించారు. అనరోగ్యానికి కారణంపై స్పష్టత రాకపోగా.. ‘మెరుగైన వైద్య సేవల కోసమే అతడిని దవాఖానాకు తీసుకెళ్లారని.. పూర్తి పరీక్షల అనంతరం వివరాలు తెలుస్తాయని’ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డాక్టర్ తెలిపారు. తొలి టెస్టుల్లో చక్కటి ఆటతీరు కనబర్చిను కుషాల్ మెండిస్ మ్యాచ్కు దూరం కాగా.. అతడి స్థానంలో కమిండు మెండిస్ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు.