దాదాపు రెండేండ్ల విరామం తర్వాత జాతీయ జట్టు తరఫున టెస్టు ఆడుతున్న కుల్దీప్ యాదవ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదుర్స్ అనిపించాడు. అశ్విన్ అండగా తొలుత బ్యాట్తో చక్కటి ఇన్నింగ్స్ ఆడిన కుల్దీప్.. ఆనక బంతితో బంగ్లా బ్యాటర్లను గింగిరాలు తిప్పాడు. సిరాజ్ స్పీడ్తో అప్పటికే డీలాపడ్డ బంగ్లాను.. కుల్దీప్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టడంతో తొలి టెస్టుపై టీమ్ఇండియా పట్టుబిగించింది.
చటోగ్రామ్: బ్యాటర్ల పోరాటానికి బౌలర్ల సహకారం తోడవడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ (3/14) వేగానికి మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ (4/33) స్పిన్ మ్యాజిక్ తోడవడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ముష్పికర్ రహీమ్ (28), లిటన్ దాస్ (24), జాకిర్ హసన్ (20) తలా కొన్ని పరుగులు చేసినా.. ఎక్కువసేపు నిలువలేకపోయారు. చేతిలో 2 వికెట్లు ఉన్న బంగ్లా.. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 271 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 278/6తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 404 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (86) ఎక్కువసేపు నిలువలేకపోగా.. అశ్విన్ (58; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కుల్దీప్ (40; 5 ఫోర్లు) రాణించారు. ఆఖర్లో ఉమేశ్ (15 నాటౌట్; 2 సిక్సర్లు) భారీ షాట్లతో జట్టు స్కోరును నాలుగొందలకు చేర్చాడు. బంగ్లా బౌలర్లలో మెహదీహసన్, తైజుల్ చెరో 4 వికెట్లు పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 404 (పుజారా 90, శ్రేయస్ 86; మెహదీ 4/112, తైజుల్ 4/133), బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 133/8 (ముష్పికర్ 28; కుల్దీప్ 4/33, సిరాజ్ 3/14).