సన్చియాన్: కొరియా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. కొరియా వేదికగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో మూడో సీడ్ సింధు 21-15, 21-10తో అయా ఒహోరి (జపాన్)పై సునాయాస విజయంతో ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 21-18, 21-6తో మిషా జిల్బర్మాన్ (ఇజ్రాయెల్)పై అలవోక విజయం సాధించాడు. మరో పోరులో భారత యువ షట్లర్ లక్ష్యసేన్కు షాక్ తగిలింది. రెండో రౌండ్లో లక్ష్య 20-22, 9-21తో షేసర్ హిరేన్ రస్తవిటో (ఇండోనేషియా) చేతిలో పోరాడి ఓడాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి 21-15, 21-19తో సింగపూర్ జోడీని చిత్తు చేసింది. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో మాళవిక బన్సోద్ 8-21, 14-21తో థాయిలాండ్ షట్లర్ పార్నాపావి చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్లో అశ్వినీ పొన్నప్ప-సుమిత్ రెడ్డి, పురుషుల డబుల్స్లో అర్జున్-ధ్రువ్ కపిల జోడీలు పరాజయంతో టోర్నీ నుంచి వైదొలిగాయి. స్విస్ ఓపెన్ టైటిల్ పోరులో తన చేతిలో ఓడిపోయిన థాయిలాండ్ షట్లర్ బుసనాన్తో సింధు క్వార్టర్స్లో తలపడనుంది. మరోసారి ఆమెను ఓడించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఈ తెలుగమ్మాయి ఉంది. ప్రపంచ మాజీ నంబర్వన్ సన్ వాన్హో (కొరియా)తో శ్రీకాంత్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.
లక్ష్య నిష్క్రమణ
ఆరు నెలలుగా లక్ష్యసేన్ సాగిస్తున్న జైత్రయాత్రకు ఈ టోర్నీలో బ్రేక్ పడింది. వరుస టోర్నీలతో అలసిపోవడంతోనే ప్రపంచ 9వ ర్యాంకర్ లక్ష్య వెనుకబడ్డట్లు తెలుస్తున్నది. ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్యం, ఇండియా ఓపెన్లో విజేతగా నిలిచిన లక్ష్య.. జర్మన్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచాడు. కొన్ని నెలలుగా విరామమెరుగకుండా ఆడుతుండటం తీవ్ర ప్రభావం పడింది. ఇది ముందే గ్రహించిన 20 ఏండ్ల లక్ష్య.. స్విస్ ఓపెన్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. విరామం అనంతరం కొరియా ఓపెన్ బరిలోకి దిగగా.. రెండ్ రౌండ్లోనే నిష్క్రమించడం చూస్తుంటే లక్ష్య మరికొన్నాళ్లు విరామం తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తున్నది.